Begin typing your search above and press return to search.

భారత్ టెక్కీలకి శుభవార్త ... హెచ్-1బీ పై బైడెన్ సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   13 March 2021 8:30 AM GMT
భారత్ టెక్కీలకి శుభవార్త ... హెచ్-1బీ పై బైడెన్ సంచలన  నిర్ణయం !
X
హెచ్‌-1బీ వీసా పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌1బీ వీసాపై పనిచేసే విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచుతూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమలును 60 రోజులపాటు వాయిదా వేస్తూ బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇది భారతీయ టెక్కీలకి శుభవార్త అని చెప్పవచ్చు. కార్మిక శాఖ శుక్రవారం ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్‌లో, మే 14 వరకూ దీని అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుండి అమలులోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపింది. హెచ్‌ 1బీ వీసాపై పనిచేసేవారి వార్షిక వేతన పరిమితి 65 వేల డాలర్లుగా ఉండేది. దాన్ని ఏకంగా లక్షా పదివేల డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ సర్కారు గత ఏడాది అక్టోబరులో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అమలు తేదీని మార్చి 15గా అప్పట్లో ప్రకటించారు. దాన్నిప్పుడు బైడెన్‌ సర్కారు వాయిదా వేసింది. ఈ నిర్ణయం అమెరికాలో పనిచేసే చాలామంది విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయ టెకీలకు ఊరట కలిగించేదే. ఎందుకంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. 1,10,000 డాలర్ల కన్నా తక్కువ వార్షిక వేతనం ఉన్నవారు స్వదేశానికి తిరిగిరావాల్సిందే. కొత్తగా వెళ్లేవారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం తో కంపెనీలు ఆచితూచి తమ ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. కాగా, హెచ్ ‌1బీ వీసాలకు సంబంధించి ట్రంప్‌ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను బైడెన్‌ సర్కారు వెనక్కితీసుకోవడాన్ని ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ రిఫార్మ్‌ వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా.. హెచ్ ‌1బీ వీసాల విషయంలో లాటరీ పద్ధతికి మళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల.. విదేశీయుల్లో అత్యుత్తమ ప్రతిభ గలిగినవారు మాత్రమే అమెరికాలో ఉంటారని ఫెయిర్ అంటుంది. దీనితో అమెరికన్‌ ఉద్యోగులకు మేలు కలుగుతుందని తెలిపింది.‌