Begin typing your search above and press return to search.

బైడెన్‌తో మోడీ భేటీ.. షెడ్యూల్ ఖ‌రారు.. ఏం మాట్లాడ‌తారు?

By:  Tupaki Desk   |   21 Sep 2021 4:27 AM GMT
బైడెన్‌తో మోడీ భేటీ.. షెడ్యూల్ ఖ‌రారు.. ఏం మాట్లాడ‌తారు?
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. మ‌రో రెండు రోజుల్లో అగ్ర‌రాజ్యం అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 24న ప్ర‌ధాని మోడీ.. ఉన్న‌తాధికార బృందం.. అమెరికాకు చేరుకుంటుంది. పర్యటనలో భాగంగా.. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్తో మోడీ 24న భేటీ కానున్నారు. తాజాగా.. వీరి సమావేశంపై వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీతో ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు ప‌డ‌తాయ‌ని అమెరికా అభిప్రాయ‌ప‌డింది. అదే సమయంలో క్వాడ్ బృందాన్ని ఈ భేటీ బలోపేతం చేస్తుందని పేర్కొంది.

బైడెన్ హ‌యాంలో

బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ.. అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి. గతంలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్, క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక, వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 24న నిర్వహస్తున్న క్వాడ్రిలేటరల్(చ‌తుర‌స్త్ర స‌మూహం) ఫ్రేమ్‌వర్క్‌ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ అధ్యక్షుడు యోషిహిడే సుగ, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కలిసి ప్రధాని మోడీ పాల్గొంటారు. 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

అమెరికా ఏమందంటే..

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌పై అమెరికా స్పందించింది. "ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలపై ఏడు దేశాబ్దాలుగా ఇరు దేశాల మైత్రి ముడిపడి ఉంది. వీటిని బలోపేతం చేసే దిశగా అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. బైడ‌న్ ప్ర‌భుత్వం స్వేచ్ఛాయుత ఇండో-పెసిఫిక్, కరొనా మహమ్మారిపై పోరాటంలో పాల్గొని భారత్తో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంది. ఇదే కొనసాగాలని ఆశిస్తోంది`` అని మోడీ ప‌ర్య‌ట‌న‌పై అగ్ర‌రాజ్యం పేర్కొంది. ఉగ్రవాద నిరోధక చర్యలపైనా ఇరు నేతలు చర్చించనున్నట్టు తెలిపింది. వివిధ ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

మంచి మిత్రులు!

ప్ర‌ధాని మోడీ- అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఇప్పటి వరకు అనేక మార్లు ఫోన్లో సంభాషించుకున్నారు. వీరిద్దిర‌కీ మంచి మిత్రులుగా పేరు కూడా ఉంది. అయితే.. బైడెన్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ కలవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో చర్చలు కేవలం ప్రభుత్వ అంశాలకే పరిమితం కాకుండా.. ఇరు దేశాలను మరింత చేరువచేసే విధంగా ఉంటాయని ఆశిస్తున్నారు.

ఇదీ.. మోడీ షెడ్యూల్‌..

+ ఈ నెల 21(ఈ రోజు) మోడీ బృందం అమెరికాకు ప‌య‌న‌మ‌వుతుంది.

+ ఈ నెల 22న మోడీ వాషింగ్టన్కు చేరుకోనున్నారు. తర్వాతి రోజు.. అమెరికాలోని సీఈఓలతో సమావేశం కానున్నారు.

+ 24సాయంత్రం వాషింగ్టన్ నుంచి న్యూయర్క్ వెళతారు.

+ ఐక్య‌రాజ్య‌స‌మితి జనరల్ అసెంబ్లీలో కీలక ప్రశంగం చేయనున్నారు.