Begin typing your search above and press return to search.

సైకిలు ఎక్కబోతున్న భూమా నాగిరెడ్డి టీం?

By:  Tupaki Desk   |   19 Feb 2016 10:11 AM GMT
సైకిలు ఎక్కబోతున్న భూమా నాగిరెడ్డి టీం?
X
ఏపీలో ఫిరాయింపు రాజ‌కీయాలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులోనూ కీలక నేత భూమా నాగిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

వైకాపా నాయకుడు భూమానాగిరెడ్డి ఆ పార్టీని వీడి తన కుమార్తెతో సహా తెలుగుదేశం గూటికి చేరనున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో షికార్లు చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి - ఆయన కుమార్తె ఆళ్లగడ్డ వైకాపా ఎమ్మెల్యే అఖిలప్రియ త్వరలో తెలుగేదేశం పార్టీలో చేరనున్నట్లు కర్నూలు జిల్లాలో వైకాపా - తెలుగేదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా భూమా నాగిరెడ్డి ఈ సాయంత్రం కార్యకర్తలతో సమావేశమవుతానని ప్రకటించారు. భూమా నాగిరెడ్డితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం కండువా కప్పుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా భూమానాగిరెడ్డికి టీడీపీ గవర్నమెంటులో మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. నంద్యాల నుంచి శాసనసభకు ప్రాతినిధ్య వహిస్తున్న నాగిరెడ్డితో పాటు ఆయన కుమార్తె - ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ - శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖరరెడ్డి - నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. వీరు నలుగురు చేరితే కర్నూలులో వైసీపీ ఆధిపత్యం పోతుంది. 14 నియోజకవర్గాలున్న కర్నూలులో వైసీపీ 11 గెలవగా టీడీపీ 3 గెలిచింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితో రెండు పార్టీల బలం 7-7గా ఉంటుంది.