Begin typing your search above and press return to search.

నంద్యాలలో టీడీపీకి చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌

By:  Tupaki Desk   |   6 July 2017 7:59 AM GMT
నంద్యాలలో టీడీపీకి చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌
X
తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీకి క్షేత్ర‌స్థాయిలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రి భూమా అఖిల ప్రియ సోదరుడైన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్ర‌జ‌ల నుంచి భ‌రోసా కంటే ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌ ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు. అడుగడుగునా ప్రజల నుంచి నెగ‌టివ్ స్పంద‌న వ‌స్తుండ‌టంతో ఆయన కొంత అసహనానికి కూడా గురవతున్నారని అంటున్నారు. క్షేత్ర‌స్థాయిలోని ప‌రిస్థితులు చూస్తుంటే గెలుపుపై టీడీపీ గెలుపు అంత ఈజీ కాద‌ని ప‌లువురు విశ్లేష‌ణ చేస్తున్నారు.

ఉప ఎన్నిక‌ నేప‌థ్యంలో భూమా బ్రహ్మానందరెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో నంద్యాలలో ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఆయనకు ప్రచారంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు తమకు ఏం అభివృద్ధి చేశారని ఓటేయాలని నిలదీయడంతో ఖంగు తిన‌డం భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితో పాటు ఆయ‌న వెంట‌ ఉన్న టీడీపీ సీనియర్ నేతల వంతు అవుతోందిని స‌మాచారం. దీంతో పాటుగా అధికార పార్టీ అభ్యర్థి కావడంతో అనేక సమస్యలను ఓటర్లు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు - పింఛన్లు - ఇళ్ల స్థలాల సమస్యలను బ్రహ్మానందరెడ్డి వద్ద చెబుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఓట్లను అడిగేందుకు రావాలని కొందరు మొహం మీదే చెప్పడంతో టీడీపీ నేతలు షాక్ కు గురయ్యారని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొందరైతే రోడ్లు - డ్రైనేజీ బాగు చేయించిన తర్వాతనే కన్పించమని కూడా ఆర్డ‌ర్ వేసిన‌ట్లు చెప్తున్నారు.

మ‌రోవైపు భూమా బ్రహ్మానందరెడ్డికి మ‌రికొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్లు స‌మాచారం. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన బ్ర‌హ్మానంద‌రెడ్డి రాజకీయ ప్రసంగాలు కూడా అలవాటు లేదు, ఎన్నికల ప్రచారంలోనూ బ్రహ్మానందరెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదు. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయన చెప్పిన పనులు చేసుకుపోవడం తప్ప మరో పని తెలియదు. ఆయన భూమా అనుచరులకు మాత్రమే పరిచయం. దీంతో ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయేందుకు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో భూమా ప్రచార బాధ్యతను నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన ఏవీ సుబ్బారెడ్డి భుజాన వేసుకున్నారు. ఓటర్లు అడిగే ప్రతి ప్రశ్నకూ ఏవీ సుబ్బారెడ్డి బదులిస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి ఇప్పుడిప్పుడే ప్రచారానికి అలవాటు పడుతున్నారని, నంద్యాలలో గెలుపు తమదేనని ధీమాను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.