Begin typing your search above and press return to search.

అఖిలప్రియ కామెంట్ బాబుకు త‌ల‌నొప్పి కాదా?

By:  Tupaki Desk   |   11 April 2017 4:15 PM GMT
అఖిలప్రియ కామెంట్ బాబుకు త‌ల‌నొప్పి కాదా?
X
నంద్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో అంత‌ర్గ‌త వివాదానికి దారితీసేలా ఇప్ప‌టికే పార్టీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌గా తాజాగా ఈ జాబితాలోకి మంత్రి భూమా అఖిల ప్రియ చేరారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు ఇప్ప‌టికే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ మేరకు అనుచరులతో శిల్పామోహన్‌ రెడ్డి రహస్య మావేశాలు జరిపారు. టీడీపీ టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారే ఆలోచనలో శిల్పామోహన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మ‌రోవైపు పార్టీ సీనియ‌ర్ నేత‌ ఎన్ ఎండీ ఫరూఖ్ కూడా తమ అనుచరులతో సమావేశమయ్యారు. నంద్యాల ఉపఎన్నిక టికెట్ భూమా కుటుంబానికి ఇవ్వని పక్షంలో.. తమకే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ వీడతామని వ్యాఖ్యానించారు. కాగా, తాజాగా మంత్రి భూమా అఖిలప్రియ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తమ కుటుంబానికే పోటీ చేసే అవ‌కాశం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. మాజీ మంత్రి ఫరూక్ సైతం తమకే మద్దతునిస్తున్నారని భూమా అఖిలప్రియ అన్నారు. తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.

కాగా, అఖిల ప్రియ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో శిల్పా ఏ విధంగా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. రాజకీయ భవిష్యత్‌పై మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శిల్పా...ఇంట్లో సన్నిహితులతో రహస్య చర్చలు జరిపారు. టీడీపీలో ఉంటే భవిష్యత్‌ ఉండదని.. పార్టీ మారాలని శిల్పామోహన్‌ రెడ్డికి టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సూచించార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. టీడీపీలో భూమా చేరినప్పటి నుంచి తమకు ప్రాముఖ్యత తగ్గిందని, కనీసం పింఛన్లను తెప్పించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో.. ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌ కూడా తమకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారని..ఇంత మంది శత్రువుల మధ్య వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీలో ఉండటం సరికాదని.. తక్షణమే రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/