Begin typing your search above and press return to search.

'భవానీదేవి' అనుభవం లేకున్నా అద్భుత ప్రదర్శన!

By:  Tupaki Desk   |   26 July 2021 9:17 AM GMT
భవానీదేవి అనుభవం లేకున్నా అద్భుత ప్రదర్శన!
X
టోక్యోలో జరుగుతున్న విశ్వక్రీడలు ఒలింపిక్స్ లో సోమవారం భారత్ కి మంచి ప్రారంభం దొరికిందని చెప్పాలి. తొలిసారి ఫెన్సింగ్ ఈవెంట్ లో ఎంట్రీ ఇచ్చిన భారత్, తొలి రౌండ్లో అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్ నుంచి పాల్గొంటున్న ఏకైక ఫెన్సర్ భవానీ దేవి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజు ఉదయం జరిగిన మ్యాచులో ట్యునీషియా కి చెందిన ఫెన్సర్ పై 14-3 తేడాతో విజయాన్ని నమోదు చేసి తన రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది.

ప్రపంచ ర్యాంకింగ్స్ లో 42వ స్థానంలో ఉన్న భవానీదేవి, ప్రత్యర్థి నదియా పై గెలిచి భారత్ ను రెన్వావ రౌండ్ కి చేర్చింది. ఆట ప్రారంభమైన దగ్గరి నుండి ఎక్కడా కూడాప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించింది. తొలి పీరియడ్ పూర్తవడానికి 8 పాయింట్లు అవసరం కాగా, భవాని దేవి ప్రత్యర్థికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా 8-0 తో మొదటి పీరియడ్ ను ముగించింది.అంతకంతకు ప్రత్యర్థి మీద వరుస దాడులు చేస్తూ తన ఆధిపత్యాన్ని 13-1 కి పెంచుకుంది. చివరకు 15-3 తో గేమ్ ను ముగించింది. రెండో రౌండులో భవానీ.. ఫ్రాన్స్ క్రీడాకారికి మేనన్ బ్రూనెట్‌ తో తలపడ్డారు. ఈ పోటీలో రైట్ ఆఫ్ వే నిబంధన ప్రకారం మేనన్ అధిక పాయింట్లు దక్కించుకుని విజయాన్ని కైవసం చేసుకున్నారు.

బలమైన ప్రత్యర్థే అయినా భవానీ తెగువ చూపించింది. అయితే 'రైట్‌ ఆఫ్‌ వే' నిబంధన ప్రకారం మేనన్‌ కు అధిక పాయింట్లు లభించాయి. అంటే ఇద్దరు ఫెన్సర్లు ఒకరినొకరు కత్తులతో స్పర్శించినప్పుడు ముందుగా దూకుడు ప్రదర్శించిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. ఒత్తిడితో నిండిన పోటీల్లో అనుభవం లేకపోవడంతో భవానీకి కలిసిరాలేదు. మొదటి పిరియడ్‌లో కేవలం 2 పాయింట్లే సాధించింది. 2-8 తేడాతో వెనకబడిన ఆమె రెండో పిరయడ్ లో దూకుడు పెంచింది. ప్రత్యర్థి ఆధిక్యాన్ని 6-12కు తగ్గించింది. విజయానికి మరో 3 పాయింట్లే అవసరం కావడంతో మేనన్‌ సునాయాసంగా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది.

భవానీ ఈ స్థాయిలో రాణించడం వెనుక ఎంతో శ్రమ దాగుంది. భవానీకి కత్తి యుద్ధంలో శిక్షణ ఇప్పించేందుకు ఆమె తల్లి తన నగలను సైతం కుదువబెట్టి మరీ డబ్బులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ కత్తియుద్ధం పోటీలలో భవానీ బ్లాక్ కార్డు వరకూ చేరుకున్నారు. ఎనిమిది సార్లు నేషనల్ ఛాంపియన్‌ గా నిలిచిన భవానీ దేవి 2016 రియో ఒలింపిక్స్‌ లో పాల్గొనాలకున్నా అది సాధ్యం కాలేదు. ఇక 2020 లో టోక్యోలో జరుగుతోన్న ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొని తన కలని సాకారం చేసుకుంది. కానీ, విజయానికి కొంచెం దూరంలో ఆగిపోయింది.

ఇక, భారీ అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్‌ ను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్ లో దురదృష్టం వెంటాడింది. తుపాకీలో సాంకేతిక లోపం తలెత్తి దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయింది. అయినప్పటికీ ఆమె పోరాడినా త్రుటిలో ఫైనల్‌ బెర్తు చేజారింది. దీనితో ఓ పతకం చేజేతులా కోల్పోయినట్లయింది. మిగతా షూటర్లు అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయారు. ఒలింపిక్స్‌ లో షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ ఈ క్రీడలో పతకం దక్కలేదు. కచ్చితంగా పతకం వస్తుందనుకున్న 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో మను బాకర్‌ తో పాటు యశస్విని సింగ్‌ దేశ్వాల్‌ ఫైనల్‌ కు అర్హత సాధించలేకపోయారు. మను, యశస్విని వరుసగా 575, 574 పాయింట్లతో 12, 13 స్థానాలకు పరిమితం అయ్యారు. 577 పాయింట్లు సాధించిన ఫ్రాన్స్‌ షూటర్‌ గోబర్‌ విల్లీ ఎనిమిదో స్థానంతో చివరి ఫైనల్‌ బెర్తును సొంతం చేసుకుంది. అయితే ఫైనల్‌ చేరనందుకు మనును నిందించడానికి లేదు. తన పిస్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా 20 నిమిషాల విలువైన సమయాన్ని ఆమె కోల్పోయింది. అయినా సరే.. మిగతా షూటర్లతో సమానంగా పోటీ పడి ఫైనల్‌ అర్హత మార్కుకు కేవలం రెండు పాయింట్ల దూరంలో ఆగిపోయింది.