Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు అవినీతి లెక్క చెబుతున్నాడు

By:  Tupaki Desk   |   7 Jun 2016 5:10 AM GMT
కేసీఆర్ సర్కారు అవినీతి లెక్క చెబుతున్నాడు
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఒకరు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు ఆరోపణలు చేయటం.. ఘాటైన విమర్శలు చేసిన ఆయన.. కొద్దికాలంగా మౌనంగా ఉంటున్నారు. ఒక పద్ధతిప్రకారం ఎదురుదాడి చేసే అలవాటున్న భట్టి చేసే విమర్శలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా కేసీఆర్ సర్కారు అవినీతి మీద ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు నేతల జేబులు నింపేవే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేసేవి కావంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నవే. తెలంగాణ రాష్ట్ర సర్కారు మీద అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ.. అవినీతి ఇంతలా జరిగిందంటూ ఆధారాల్ని చూపించింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా భట్టి కొన్న అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ అధికారపక్షం నేతలు గడిచిన రెండేళ్లలో రూ.2లక్షల అవినీతికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.

రూ.42 వేల కోట్లతో జరుగుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ పనుల్లో జరుగుతున్న అవినీతి గురించి తానిక రోజుకొక చిట్టా విప్పనున్నట్లుగా చెప్పారు.

జాలిముడి.. కట్టలేరు.. మున్నేరు ప్రాజెక్టులపై సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నభట్టి.. తాను కోరినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ చేయించగలరా? అంటూ సవాలు విసురుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ ను ‘ఆ నలుగురు’ పంచుకుంటున్నట్లుగా ఆరోపిస్తున్న భట్టి.. రోజుకో చిట్టా వాస్తవంలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. ఏది ఏమైనా ఇప్పటివరకూ కేసీఆర్ సర్కారులో అవినీతి ఉందంటూ ఆరోపణల స్థాయి నుంచి.. అవినీతి ఎంత స్థాయిలో జరుగుతుందన్న విషయాన్ని తొలిసారి ఫిగర్ రూపంలో చెప్పిన ఘనత మాత్రం భట్టిదేనని చెప్పక తప్పదు.