Begin typing your search above and press return to search.

రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్

By:  Tupaki Desk   |   29 March 2021 4:01 AM GMT
రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్
X
కోవిడ్ వ్యాక్సిన్ల తయారీతో ప్రతి ఒక్కరికి సుపరిచితంగా మారారు భారత్ బయోటెక్ సంస్థ. హైదరాబాద్ కు చెందిన ఈ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ కు మంచి పేరే వచ్చింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే వ్యాక్సిన్ ను వేసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని రూ.100 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కోరింది. ఎందుకంత భారీగా నిధుల్ని కోరినట్లు? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్రం ‘‘కొవిడ్ సురక్షా పథకం’ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు 40 లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. దీన్ని మరింత పెంచేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దీని ఉత్పత్తి మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా అనుకుంటున్న దాని ప్రకారం ముంబయిలోని హఫ్ కినేలోనూ కోవాగ్జిన్ ను తయారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన టెక్నాలజీ బదలాయింపునకు భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది. అయితే.. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.154 కోట్లు అవసరమవుతాయి. ఇందులో భాగంగా రూ.100 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతోంది భారత్ బయోటెక్. ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభిస్తే..మరింత ఎక్కువగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే వీలుంది. మరోవైపు కోవీ షీల్డ్ వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తున్న సీరం సంస్థ సైతం కేంద్రాన్ని నిధులు విడుదల చేయాలని కోరుతోంది. మరి.. కేంద్రం ఎంత వేగంగా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.