Begin typing your search above and press return to search.

23వేల మందిపై కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు

By:  Tupaki Desk   |   3 Jan 2021 8:30 AM GMT
23వేల మందిపై కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు
X
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కూడా కేంద్రం అనుమతి పొందేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు లైన్ క్లియర్ అయ్యింది. అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్ కు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్.సీ.ఓ) విషయ నిపుణుల కమిటీకి నిన్ననే సిఫారసు చేసింది.

ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కోవీషీల్డ్ కు కూడా ఇలాంటి సిఫారసులు చేయగా.. తాజాగా భారత్ బయోటెక్ ది కూడా సమీక్షించేందుకు డీసీజీఐ రెడీ అయ్యింది.ఆదివారం ఈ కీలక భేటి జరుగనుంది. ఈరోజే టీకాకు అనుమతులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎస్.ఐ.పీ)ల సంయుక్త సహకారంతో కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది.

తాజాగా శనివారం మధ్యాహ్నం జరిగినే భేటిలో కమిటీ సభ్యులు భారత్ బయోటెక్ నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘మొత్తం 25800 మంది వలంటీర్లతో మూడోదశ ప్రయోగ పరీక్షలను నిర్వహించాలని భారత్ బయోటెక్ భావించగా.. ఇప్పటివరకు 23 వేల మంది భర్తీ పూర్తయింది.. ఎంపిక చేసిన వలంటీర్లలో దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు ’ అని కమిటీ సభ్యులు తెలిపారు.

ఇప్పటివరకు ట్రయల్స్ ఫలితాలను బట్టి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ భద్రమైందనే విషయం తేలిందని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే దాని ప్రభావశీలత ఎంత ఉందనేది ఇంకా తేలాల్సి ఉంది. అని వారు పేర్కొన్నారు.

కరోనా కొత్త స్ట్రెయిన్లతో ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా అత్యవసర పరిమితులతో కూడిన వినియోగం కోసం కోవాగ్జిన్ అనుముతులు ఇవ్వవచ్చని నిపుణుల కమిటీ భావిస్తున్నట్టు సమాచారం.