Begin typing your search above and press return to search.

ఈసీ నిర్ణ‌యం ప్ర‌భుత్వానికి షాక్ వంటిదే

By:  Tupaki Desk   |   1 Jan 2017 7:47 AM GMT
ఈసీ నిర్ణ‌యం ప్ర‌భుత్వానికి షాక్ వంటిదే
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం ఏపీలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అనూహ్య అభిప్రాయం వ్య‌క్తం చేసింది. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో చిత్తూరు - నెల్లూరు - ప్రకాశం జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు - రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌ లాల్ ఓటర్ల నమోదు - అభ్యంతరాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ "చిత్తూరు - ప్రకాశం - నెల్లూరు ఉపాధ్యాయ - పట్ట‌భద్రుల శాసన మండలి నియోజకవర్గాన్ని సమస్యా త్మక నియోజకవర్గంగా గుర్తించాం. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఫిర్యాదులు అందాయి. అధికారులు తప్పులు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఎమ్మెల్సీ ఎన్నికలను నిలిపేస్తాం' అని భన్వర్‌ లాల్‌ హెచ్చరించ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఈ మూడు ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార తెలుగుదేశం పార్టీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు విప‌క్షాలు ఆరోపించిన‌ సంగ‌తి తెలిసిందే.

కాగా ఈ స‌మీక్ష సంద‌ర్భంగా ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి - సీపీ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి రాతపూర్వకంగా అభ్యంతరాలను అందించారు. ఆన్‌ లైన్‌ లో నమోదైన ఓటర్లను తమ కార్యకర్తలు 3 జిల్లాలలో పరిశీలించారని 1670 మంది అనర్హులను గుర్తించారని వివరించారు. ఆన్‌ లైన్‌ లో ఓటర్ల నమోదు దారుణంగా జరిగిందని, ఏ పర్యవేక్షణ లేకుండా బాధ్యతా రహితంగా అధికారులు ప్రవర్తించారని, ఓటరు గుర్తింపు కార్డు - ఆధార్‌ కార్డు - 10వ తరగతి మార్కులిస్టు - పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో - ట్రాన్స్‌ ఫర్‌ సర్టిఫికెట్‌ - మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ లతో పట్టభద్రుల ఓటర్లుగా నమోదయ్యాయని ఆధారాలతో సహా చూపించారు. దీంతో ఆశ్యర్యానికి గురయిన భన్వర్‌ లాల్‌ ఇదేలా సాధ్యమైంది? ఆన్‌ లైన్‌ లో నమోదైన ప్రతి ఓటరును తనిఖీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని, అవసరమైతే ఈ ఎన్నికల తేదీలను మార్చేస్తానని, బాధ్యులైన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జనవరి 3వ తేదీలోపు సమగ్ర నివేదికను ఇస్తామని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రెవెన్యూ అధికారులు భన్వర్‌లాల్‌కు హామీ ఇచ్చారు.

ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగి ఉంటే రాతపూర్వక ఫిర్యాలను రాజకీయ పార్టీలు అందించాలని భన్వర్‌ లాల్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి చివరి తేదీ లేదని, జనవరి 12న ప్రకటించే ఓటర్ల లిస్టు కూడా చివరిది కాదని, నామినేషన్‌లు వేసే వరకూ మార్పులు ఉంటాయని తెలిపారు. తప్పులు జరిగినట్టు రాజకీయ పార్టీలు, ప్రజలు ఫిర్యాదులు ఇస్తే తొలగిస్తామని, నిజమైన ఓటర్ల ప్రయోజనాలు కాపాడతామని, విలువల రక్షణ కొరకు అందరూ సహకరించాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/