Begin typing your search above and press return to search.

సూరి హత్యకేసులో కోర్టు తీర్పు

By:  Tupaki Desk   |   18 Dec 2018 8:40 AM GMT
సూరి హత్యకేసులో కోర్టు తీర్పు
X
టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరిని చంపిన భానుకిరణ్ కు ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టు శిక్ష విధించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఈ కేసు తుది తీర్పు 7 ఏళ్ల తర్వాత వెలువడింది.

సూరిని హత్య చేసిన అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్ పై ఆరోపణలు కోర్టులో రుజువయ్యాయి. దీంతో అతడికి యావజ్జీవ శిక్షతోపాటు 20వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో భాను కిరణ్ కు సహకరించిన మరో నిందితుడు మన్మోహన్ సింగ్ కు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించింది. మరో నలుగురిని ఈ కేసులో నిర్ధోషులుగా వెలువరించింది.

2011 జనవరి 3న హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఓ లాయర్ తో మాట్లాడి మద్దెల చెరువు సూరి, ఆయన అనుచరుడు భానుకిరణ్ లు కారులో బయలు దేరారు. కారు వెనుక సీట్లో భానుకిరణ్ కూర్చోగా.. ముందు సీట్లో సూరి కూర్చున్నాడు. కారు నవోదయ కాలనీకి చేరుకోగానే తన వద్దనున్న తుపాకీ తీసి పాయింట్ బ్లాంక్ దూరంలోనుంచి సూరిని కాల్చి చంపి అనంతరం భానుకిరణ్ పారిపోయాడు. డ్రైవర్ మధు సూరిని అదే కారులో ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

డ్రైవర్ మధు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 117మంది సాక్షులను పోలీసులు విచారించారు. పారిపోయిన భాను కిరణ్ ఆ తర్వాత 14 నెలలకు 2013 ఏప్రిల్ 12న పోలీసులకు చిక్కాడు. భాను కిరణ్ కు హత్య విషయంలో తుపాకీ అందించి సాయం చేసిన మన్మోహన్ సింగ్ ను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరిపై నేరం రుజువుకావడంతో కోర్టు శిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సుబ్బయ్య - వెంకటరమణ - హరిబాబు - వంశీలపై సీఐడీ నేరాన్ని రుజువు చేయకపోవడంతో వారిని కోర్టు నిర్ధోషులుగా తేల్చింది.

కాగా విచారణ సందర్భంగా గడిచిన 6 ఏళ్లుగా భాను కిరణ్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ పై బయటకు రావడానికి ఇష్టపడలేదు. బయటకొస్తే చంపేస్తారన్న భయంతోనే ఆయన జైలులో గడిపినట్టు సమాచారం.