Begin typing your search above and press return to search.

అంతరిక్ష యాత్ర తర్వాత బెజోస్ కీలక ప్రకటన.. వారిద్దరికి రూ.1492కోట్లు

By:  Tupaki Desk   |   22 July 2021 12:30 PM GMT
అంతరిక్ష యాత్ర తర్వాత బెజోస్ కీలక ప్రకటన.. వారిద్దరికి రూ.1492కోట్లు
X
అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొచ్చిన ప్రపంచ కుబేరుడు కమ్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. తన యాత్ర అనంతరం కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతరిక్ష వ్యాపారాన్ని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తన సొంత కంపనీ బ్లూ ఆరిజిన్ రూపొందించిన వ్యోమనౌకలో అంతరిక్ష యాత్రను పూర్తి చేయటం తెలిసిందే. అనంతరం ఆయనో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన అంతరిక్ష యాత్ర నేపథ్యంలో కొత్తగా ''కరేజ్ అండ్ సివిలిటీ'' అవార్డులను ఇస్తామని చెప్పటమే కాదు.. తమ పురస్కారాలకు సంబంధించి ఇద్దరు విజేతల్ని ఆయన ప్రకటించారు.

సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఏకతాటి మీదకు తీసుకొచ్చే వారిని ఈ పురస్కారం కింద ఎంపిక చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు పురస్కారాలు ఉన్నప్పటికీ.. ఈ పురస్కారం కింద ఎంపికైన వారికి భారీ నజరానాను ఇవ్వటం దీని ప్రత్యేకతగా చెప్పాలి. ఈ అవార్డు కింద ఎంపికైన ఇద్దరికి (ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్, రచయత వ్యాన్ జోన్స్) వంద మిలియన్ డాలర్ల చొప్పున అందజేయనున్నట్లు చెప్పారు. మన రూపాయిల్లో చెప్పాలంటే విజేతలు ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ.746 కోట్లు పురస్కారం కింద అందనున్నాయి.

ఈ పురస్కారాన్ని రానున్న రోజుల్లో కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఎప్పుడెప్పుడు ఇస్తారన్న దానిపై స్పష్టత మాత్రం ఇవ్వకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. అమెజాన్ అధినేత షురూ చేసిన అవార్డుల్ని ఆ ఇద్దరికే ఎందుకు ఎంపిక చేసినట్లు? వారికున్న ప్రత్యేకత ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. ఇద్దరు కూడా సమాజం కోసం పాటుపడే ప్రముఖులుగా చెప్పాలి. విజేతల్లో ఒకరైన జోస్ ఆండ్రెస్ ది ఫ్రాన్స్. ప్రముఖ చెఫ్ గా అతడు సుపరిచితుడు.

2010లో వరల్డ్ సెంట్రల్ కిచెన్ అనే ఎన్జీవోను ఏర్పాటు చేసి.. ప్రపంచ వ్యాప్తంగా విపత్తులు చోటు చేసుకున్నప్పుడు.. కరవు ప్రాంతాల్లో ఆకలితో ఇబ్బంది పడే వారికి ఆహారాన్ని అందజేస్తుంటారు. చెఫ్ అన్నంతనే మన దేశానికి చెందిన సంజీవ్ కపూర్ గుర్తుకు వస్తారు. అతనితో కలిసి 15 నగరాల్లో 30 ప్రాంతాల్లో ప్రజలకు భోజనాన్ని అందిస్తున్నారు. కరోనా వేళ.. ఆసుపత్రుల్లో బాధితులు.. వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్యారోగ్య సిబ్బందికి అండగా నిలిచారు. ఇటీవల ఆండ్రెస్ భారత్ కు వచ్చారు. పురస్కారానికి ఎంపికైన మరో ప్రముఖుడు రచయిత కమ్ టీవీ హోస్ట్ వ్యాన్ జోన్స్. ఇతడు ఇప్పటికే ప్రఖ్యాత మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయితగా మూడుసార్లు ఎంపికయ్యారు.

సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ఆయన పని చేస్తుంటారు. డ్రీమ్ కోర్ అనే ఎన్జీవోను ఏర్పాటు చేసి.. వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రత్యేక సలహాదారుగా పని చేస్తున్నారు. అంతేకాదు.. క్రిమినల్ జస్టిస్ లో సంస్కరణల్ని తీసుకొచ్చేందుకు పని చేస్తున్నారు. ఇలా రెండు భిన్న అంశాల మీద పని చేసే ఇద్దరు ప్రముఖులకు అమెజాన్ అధినేత పురస్కారం లభించింది.