Begin typing your search above and press return to search.

ఎన్ని ఆయుధాలు తీసినా బేఫికర్...బాల్ అక్కడేనా...?

By:  Tupaki Desk   |   31 Jan 2022 9:43 AM GMT
ఎన్ని ఆయుధాలు తీసినా బేఫికర్...బాల్ అక్కడేనా...?
X
ప్రభుత్వ ఉద్యోగుల శక్తి అలాంటిది. వారు ఒకరిద్దరు కాదు, ఏకంగా పదమూడు లక్షల మంది దాకా ఉన్నారు. ఇక వారి కుటుంబాలతో కలుపుకుంటే అరకోటి పైచిలుకు లెక్క తేలుతుంది. రాజకీయంగా చూసుకుంటే ఇది అద్భుతమైన శక్తి. ఇంత పెద్ద ఎత్తున ప్రభావిత వర్గం సమాజంలో మరోటి లేదు.

మరో వైపు చూస్తే రాజకీయ నాయకులు అధికారంలో ఉండేది అయిదేళ్ళు, జనాలు దయతలిస్తే మరో అయిదేళ్ళు, కానీ ఉద్యోగులు అలా కాదు వారి టోటల్ సర్వీస్ 35 ఏళ్లు. ఇంత సుదీర్ఘ సర్వీసులో ఏకంగా ఏడెమినిది ప్రభుత్వాలను చూస్తారు. ఎందరో ముఖ్యమంత్రులనూ చూస్తారు. అలా కనుక చెప్పుకుంటే రాజకీయంగా వారి అనుభవమే ఎక్కువగా చూడాలి.

ఇక ఏ ప్రభుత్వం ఉన్నా పని చేయించుకోవాల్సింది ఉద్యోగులతోనే. వారే నేరుగా జనాలకు కనిపించేది. అలా అనుకుంటే ప్రభుత్వానికి కళ్ళూ ముక్కూ చేవీ అన్నీ వాళ్ళే. అలాంటి ఉద్యోగులు కాడె వదిలేస్తే సర్కార్ తల్లకిందులు అవుతుంది. వారి నోట సమ్మె అన్న మాటే రాకేపోవాలి. అంతదాకా సీన్ లేకుండా చూసుకోవాలి. కానీ వారు రంగంలోకి దిగారా అంటే ఇక ఏ భయాలూ వారిని ఆపలేవు.

గతంలో చాలా గట్టి వారు, పట్టుదల కలిగిన వారు సీఎం లుగా ఉన్నా చివరికి ఉద్యోగులే గెలిచారు. వారి పోరాట పటిమ సంఘటిత శక్తి అటువంటిది. అందుకే వారు మీరు ఎన్ని అస్త్రాలు తీసినా మేము భయపడమని అంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగించాలనుకుటోంది అన్న వార్తల పట్ల తాజాగా ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఒక్క ఎస్మా యే కాదు, అంతకు మించి చర్యలు తీసుకున్నా తాము తగ్గేదే లేదు అని క్లారిటీగా చెప్పేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి చూసుకుంటే ఉద్యోగుల సహకారం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని తేలిపోయింది. ఆదేశాలు ఎన్ని జారీ చేసినా అవి బేఖాతరే చేస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగులను నయానో భయానో ఒప్పించి కొత్త పీయార్సీ మేరకు జీతాలు ఇప్పించాలనుకున్నా అది ఏ కోశానా కుదిరే సీని కనిపించడంలేదు. ఉద్యోగుల జీతాల ప్రాసెస్ అన్నది అనుకున్నంతగా ముందుకు సాగడంలేదు.

దాంతో ప్రభుత్వం ఇపుడు ఏం చేస్తుంది అన్నది కూడా చూడాలి. ఇక్కడ స్థూలంగా ఆలోచిస్తే ప్రభుతం ఇంటీరియం రిలీఫ్ అన్నది 27 శాతం ప్రకటించింది. ఫిట్మెంట్ చూస్తే 23 శాతం ఇచ్చింది. అక్కడే సర్కార్ తొలి తప్పు చేసింది అన్నది ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా అర్ధమైపోతుంది. అక్కడితో ఆగకుండా ఏకపక్షంగా హెచ్ ఆర్ ఏ లలో భారీ కోతలు పెట్టేసింది. అవి కూడా దారుణంగా ఉన్నాయి.

మరి వీటితో పాటు తగ్గిన ఫిట్మెంట్ కి సంబంధించి 27 శాతం ఇంటీరియం రిలీఫ్ రెండున్నరేళ్ళ నుంచి ఇస్తున్నారు కాబట్టి అలా తీసుకున్న దాన్ని రికవరీ చేస్తామని కూడా చెబుతోంది. ఇది ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా మంట పుట్టించేలా ఉంది. అదనపు క్వాంటమ్ అన్నది పెన్షనర్లకు డెబ్బై ఏళ్లు దాటితే ఇస్తారు, దాని వయోపరిమితిని ఇపుడు ఎనభై ఏళ్ళు చేసి పారేశారు. ఇలా చాలా చేసేసి మీకు అంతా మంచే చేశామని సర్కార్ పెద్దలు చెబుతూంటే నమ్మే స్థితిలో ఉద్యోగులు లేరనే అంటున్నారు. మొత్తానికి ఇపుడు సీన్ ఫుల్ క్లారిటీగా ఉంది.

ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల విషయంలో గట్టిగా పోరాడుతున్నారు. వారు ఎక్కడా ఈ దశలో తగ్గరు, ఇక వారు ఎన్ని రోజులు అయినా సమ్మె చేస్తారు అని గతంలో చేసిన 53 రోజుల సుదీర్ఘ సమ్మె రుజువు చేసింది. నాడు ఉమ్మడి ఏపీ కాబట్టి మళ్ళీ కోలుకుంది. ఇపుడు విభజన ఏపీ, కరోనా వేళ ఇలా ఉద్యోగులు సమ్మెకు పోతే రాష్ట్రం మరింతగా దెబ్బ తినడం ఖాయం. అందువల్ల ప్రభుత్వమే ఇవన్నీ ఆలోచించి ఒకటి రెండు కాదు ఎన్ని మెట్లు అయిన దిగాల్సిందే అన్న మాట అయితే వస్తోంది. ఇక్కడ భేషజాలకు పోకుండా ఒక తండ్రి మాదిరిగా ప్రభుత్వం తగ్గినా ఏమీ తప్పులేదని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే బంతి ఇపుడు సర్కార్ చేతిలో ఉంది. సో అందరి చూపులూ అటు వైపే ఉన్నాయి.