Begin typing your search above and press return to search.

ఏపీలో బీర్ రేటు రూ.300 లా!

By:  Tupaki Desk   |   2 Aug 2019 11:24 AM GMT
ఏపీలో బీర్ రేటు రూ.300 లా!
X
జగన్ ప్రభుత్వం వచ్చీ రాగానే బెల్ట్ షాపులను పూర్తిగా తుడిచి వేసింది. మద్యపాన నిషేధం దశల వారీగా అని చెప్పిన జగన్ సీఎం కాగానే బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపారు. మండల కేంద్రాల్లో ఓ మోస్తరు పట్టణాల్లో ఉండే వైన్ షాపులు - బార్ ల ఆధారంగా పల్లెల్లో బెల్ట్ షాపులు నడుస్తూ ఉండేవి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా బెల్ట్ షాపుల నిషేధానికి కట్టుబడి ఉన్నట్టుగా చెప్పుకుంది. అయితే అధికార పార్టీకి సన్నిహితులు అయిన వాళ్లు అలా అమ్మకాలు సాగించారు.

అయితే మద్యపాన నిషేధంలో తన మాటకు కట్టుబడి ఉన్న జగన్ మోహన్ రెడ్డి బెల్ట్ షాపులను రద్దు చేశారు. అబ్కారీ శాఖ ద్వారా వాటిపై ఉక్కుపాదం మోపించారు. అయితే ఇలాంటి దందాలు ఒక చోట అరికడితే మరో చోట పుట్టుకువస్తూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో అప్పుడే అక్రమంగా పల్లెల్లో కూడా మద్యం అమ్మకం మొదలైందనే మాట వినిపిస్తోంది. కొన్ని కూల్ డ్రింక్ షాపుల్లోనూ - ఇతర అంగళ్లలోనూ చాటుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం.

ఎలాగూ అది బ్లాక్ మార్కెట్ కాబట్టి ధర భారీగా పెట్టి అమ్ముతున్నారట. రెట్టింపు ధరకు అమ్ముతూ ఒక్కో బీర్ ను మూడు వందల రూపాయలకు కూడా అమ్ముతూ ఉన్నారని సమాచారం. అలా మద్యం అప్పుడే బ్లాక్ మార్కెట్ లో పారుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సింది అధికారులే. మద్యపాన నిషేధం అనేది ముఖ్యమంత్రి ఒక్కరూ అనుకుంటే జరగదు. ఉత్తర్వుల వరకూ వారు ఇచ్చినా - కఠినంగా వ్యవహరించాల్సింది అధికారులే. అయితే అధికారులు ఇలాంటి వ్యవహారాల్లో కూడా తమకు అందే మొత్తాలను - లంచాలకు కక్కుర్తి పడుతూ ఉంటారు. దీంతో మద్యం బ్లాక్ మార్కెట్ దందా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అధికారులపై ఒత్తిళ్లు పెంచితే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.