Begin typing your search above and press return to search.

ఎలుగుబంటి ఎంట్రీ.. అక్కడ నిజంగానే లాక్ డౌన్

By:  Tupaki Desk   |   24 March 2020 1:21 PM IST
ఎలుగుబంటి ఎంట్రీ.. అక్కడ నిజంగానే లాక్ డౌన్
X
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రభుత్వం లాక్ డౌన్ చేసేసింది. జనాలను ఇంటినుంచి బయటకు రావద్దని ఆదేశించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

లాక్ డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో ఓ ఎలుగుబంటి జనవాసాల్లోకి వచ్చింది. బయట తిరుగుతున్న వారిని వెంటాడి వెంబడించి ఇళ్లలోకి పోయేలా చేసింది. లాక్ డౌన్ పాటించని ప్రజలను ఓ రకంగా భయపెట్టిందనే చెప్పాలి.

తెలంగాణలోని కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం లాక్ డౌన్ కారణంగా బోసిపోయింది. దీంతో సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సోమవారం రాత్రి పట్టణంలోకి ప్రవేశించింది. జనాలు లేకపోవడంతో సర్ సిల్క్ విజయా బస్తీలో స్వేచ్ఛగా తిరిగింది.

ఎలుగుబంటిని చూసి ప్రజలు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులకు కొందరు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా మరో కాలనీలోకి పారిపోయింది. ఆ తర్వాత ఆచూకీ కనిపించకుండా పోయింది. దీంతో ఏ మూలన ఉందో.. ఎప్పుడు వస్తుందోనని కాగజ్ నగర్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎలుగుబంటి కారణంగా కాగజ్ నగర్ లో నిజంగానే లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది.