Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షంలో కొత్త పంచాయ‌తీ మొద‌లైంది

By:  Tupaki Desk   |   6 Aug 2017 10:45 AM GMT
ప్ర‌తిప‌క్షంలో కొత్త పంచాయ‌తీ మొద‌లైంది
X
విప‌క్షంలో ఉన్న పార్టీ ఎలా ఉండాలి? ప్ర‌జా స‌మస్య‌ల‌పై దూకుడుగా స్పందించాలి. ప్ర‌భుత్వాన్ని ఇరకాటంలో ప‌డేయాలి. కానీ కుమ్ములాట‌ల‌తో త‌మ‌ని తాము అస్స‌లే త‌క్కువ చేసుకోకూడ‌దు క‌దా? కానీ తెలంగాణ‌లో ప్రధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ పార్టీలో అచ్చంగా అదే జ‌రుగుతోంది. ఒకవైపు అసమ్మతి మంట మండుతూనే ఉండ‌గా....మరోవైపు త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని బీసీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పోరుబాట పట్టారు. బలమైన సామాజికవర్గం తమను అణగదొక్కుతున్నదని బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార టీఆర్‌ ఎస్‌ బీసీలకు తాయిలాలు ప్రకటిస్తూ వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంటే... కాంగ్రెస్‌ లోని బీసీలను మాత్రం పార్టీనే నిర్లక్ష్యం చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర నాయకత్వం కూడా తమను హేళన చేసి మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 36 సీట్లు కేటాయిస్తే ఒక్కటైనా గెలిచారా? ఇప్పుడేం గెలుస్తారు. వారి వద్ద అంత డబ్బు ఉందా? అంటూ ముఖ్యమైన నేత తన అనుయాయుల వద్ద అవహేళన చేసి మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీతో పార్టీ సీనియర్‌ నేత టి నాగయ్య నేతృత్వంలో 30 మంది బీసీ నేతలు స‌మావేశ‌మై పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయం, తమకు పార్టీలో కీలకమైన పోస్టులివ్వాలని కోరగా త్వ‌ర‌లో తాను ప‌రిశీలిస్తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో మొత్తం 119 ఎమ్మెల్యే సీట్లు ఉంటే జనాభా ప్రకారం తమకు 50 శాతం సీట్లు ఇవ్వాలని అడిగామ‌ని, లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించుకుంటామని కూడా ఈ వ‌ర్గం నేత‌లు చెప్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ అంశంపై తాము అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమవుతామని కూడా వారు అంటున్నారు.

గత ఎన్నికల్లో పార్టీకి బలంలేని నాంపల్లి - చార్మినార్‌ వంటి సీట్లు కేటాయించి గెలవలేదని చెప్పడం సరికాదని బీసీ నేత‌లు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని బీసీ నేత క్యామ మల్లేష్‌ కు కేటాయించి, అక్కడ మల్‌ రెడ్డి బ్రదర్స్‌ను ప్రోత్సహించి రెబల్‌గా పోటీ చేయించారని, ఆయన ఓటమికి పార్టీయే కారణమైందన్న విమర్శలు ఉన్నాయి. భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఉండగా...ఈసారి బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డిని పోటీ చేయించాలని పీసీసీ భావిస్తున్నది. కల్వకుర్తి నియోజవర్గం నుంచి ఎన్టీఆర్‌ ని ఓడించి సంచలనం సృష్టించిన చిత్తరంజన్‌ దాస్‌ కు ప్రస్తుతం కనీసం నామినేషన్‌ పదవి కూడా ఇవ్వకుండా ఇవ్వలేదు. కొన్ని నియోజకవర్గాల్లో బీసీలు కీలకంగా ఉన్నప్పటికి రాష్ట్ర నాయకత్వం తమ వర్గీయులను ప్రోత్సహి స్నుట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. బీసీ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధ్యక్ష పదవిని 11 నెలలకే ఆయనను తప్పించారు. ఈ వ్యవహారం వెనక బలమైన సామాజిక వర్గం కీలకపాత్ర పోషించినట్టు ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని రాహుల్‌గాంధీకి వివరించామ‌ని, తమకు న్యాయం జరగక్కపోతే వేరు కుంపటికి కూడా వెనకాడబోమని అంటున్నారు. ఈ డిమాండ్‌కు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మ‌రి!