Begin typing your search above and press return to search.

ప‌ప్పు చేయడం తెలిసిన అమెరికా అధ్య‌క్షుడిని నేనే

By:  Tupaki Desk   |   1 Dec 2017 1:06 PM GMT
ప‌ప్పు చేయడం తెలిసిన అమెరికా అధ్య‌క్షుడిని నేనే
X
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చ‌మ‌త్కారానికి ఇదో నిద‌ర్శ‌నం. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌ షిప్ సమ్మిట్‌ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన ఆయన ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. ఈ సదస్సులో భాగంగా కరణ్ థాపర్‌ తో ఒబామా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇండియా ఫేవరెట్ డిష్ అయిన పప్పు ఎలా చేయాలో తెలిసిన ఏకైక అమెరికా అధ్యక్షుడిని తానే అని ఒబామా చెప్పారు. అంతేకాదు..వీటితో పాటుగా వ‌చ్చిన ఇత‌ర‌త్రా వంట‌కాల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు.

ఈ ప‌ర్య‌ట‌న కోసం ఒబామా గురువారం ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. హోటల్లో ఉన్న సమయంలో ఓ వెయిటర్ తనకు పప్పు వడ్డించి.. అది ఎలా చేస్తారో చెప్పే ప్రయత్నం చేశాడని ఒబామా తెలిపారు. అయితే అది తనకు తెలుసని, తాను స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే ఓ ఇండియన్ రూమ్‌ మేట్ ద్వారా పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నానని ఆయన చెప్పడం విశేషం. అంతేకాదు తాను చేసిన కీమా కూడా అద్భుతంగా ఉంటుందని ఒబామా అన్నారు. చికెన్ కూడా బాగానే చేస్తానని చెప్పారు. మరి చపాతీ చేయడం వచ్చా అని కరణ్ థాపర్ ఆయనను ప్రశ్నించగా.. అది అస్సలు రాదు...చపాతీ చేయడం చాలా కష్టమంటూ ఒబామా చెప్పారు.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అమెరికాది అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అని, భారత్‌ ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం అని ఒబామా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే సత్తా ఇంటర్నెట్‌ కు ఉందని కూడా ఒబామా హెచ్చరించారు. రాజ్యాంగంలో ఉన్న విలువలను ప్రతి రోజు మనం ప్రచారం చేయాలన్నారు. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు. కేవలం ఆసియాలోనే మాత్రమే కాకుండా, విశ్వవ్యాప్తంగా భారత్ తన పాత్రను పోషించాలని ఒబామా సూచించారు. మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని, పేద-ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్ వాతావరణ ఒప్పందం కోసం తాను - ప్రధాని మోడీ విశేషంగా కృషి చేసినట్లు చెప్పారు.

భారత్ - అమెరికాలు కలిసి పనిచేస్తే - పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని ఒబామా అన్నారు. అంతర్జాతీయంగా ప్రజల్లో అభద్రతాభావం ఉందని - దాన్ని తొలిగిస్తేనే మానవ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారని, కానీ ప్రజలు మద్దతు ఇస్తేనే నవ సమాజం ఏర్పడుతుందని ఒబామా అన్నారు. న్యూక్లియర్ సైప్లె గ్రూప్‌ లో భారత్‌ ను చేర్చాలని తాము ప్రయత్నించామని, కానీ కొన్ని దేశాలు అడ్డుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాద చర్యలు ఎవరినైనా ఇబ్బందిపెడుతాయని ఆయన అన్నారు. ముంబై దాడుల తర్వాత తాము ఆ విధంగా ఆలోచన చేశామన్నారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తాను ఇష్టపడతానని, అతను దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి చేస్తున్నారని, మాజీ ప్రధాని మన్మోహన్ అన్నా తనకు అభిమానమని ఒబామా అన్నారు.