Begin typing your search above and press return to search.

ఎనిమిది మార్గాల్లో బ్యాంకులు దోచేస్తున్నాయి!!

By:  Tupaki Desk   |   15 Dec 2016 5:25 AM GMT
ఎనిమిది మార్గాల్లో బ్యాంకులు దోచేస్తున్నాయి!!
X
పెద్ద నోట్ల ర‌ద్దు షాక్ నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలోనే...స‌రిప‌డా న‌గ‌దు దొర‌క‌క బ్యాంకులు - ఏటీఎంల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత అన్ని బ్యాంకుల్లో సిబ్బందిపై భారీగా పని ఒత్తిడి పెరిగింది. అయితే కొందరు అవినీతి బ్యాంకు అధికారులు-సిబ్బంది సామాన్యులను ఇబ్బంది పెడుతూ అక్రమార్కులకు రెడ్‌ కార్పెట్ పరుస్తున్నారు. కింది స్థాయి అధికారుల నుంచి ఆర్బీఐ అధికారుల వరకు కమీషన్లకు కక్కుర్తిపడి కొత్తనోట్లను అక్రమంగా తరలిస్తూ - నల్లధనాన్ని వివిధ మార్గాల్లో తెల్లగా మారుస్తూ నల్లకుబేరులకు అండగా నిలుస్తున్నారు. సీబీఐ - పోలీసులు - ఈడీ - ఐటీ దర్యాప్తులో వారి భాగోతాలు వెలుగుచూస్తుండటం, అరెస్టుల పరంపర కొనసాగుతుండటంతో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వెలుగుచూసిన కేసుల ఆధారంగా బ్యాంకింగ్ వ్యవస్థలోని ఏడు ప్రధాన వైఫల్యాలను ఇవి

1. పక్కదారి పడుతున్న ఐడీప్రూఫ్స్

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు పాన్‌ కార్డుతోపాటు - ఆధార్ - ఓటర్‌ ఐడీ వంటి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు సమర్పించేవారు. కొందరు సిబ్బంది ఆ ఐడీ ప్రూఫ్స్‌ ను పక్కదారి పట్టిస్తున్నారు. వాటిని జిరాక్స్ తీసి ఆయా పేర్లపై నల్లకుబేరుల నగదు మార్పిడి చేశారు. భారీగా కొత్త నోట్లను అక్రమార్కులకు అప్పగించారు. బెంగళూరు ఇందిరానగర్‌లోని కర్ణాటక బ్యాంక్ శాఖ చీఫ్ మేనేజర్ సూర్యనారాయణ నోట్ల మార్పిడి కోసం బ్యాంకుకు వచ్చిన ప్రజల ఐడీ ప్రూఫ్స్‌ను దుర్వినియోగం చేశారని సీబీఐ గుర్తించింది. మధ్యవర్తుల ద్వారా అక్రమార్కుల నల్లడబ్బును మార్పిడి చేసి కొత్తనోట్లను వారికి అందించినట్టు తేల్చింది.

2. అక్రమాలకు అడ్డాగా ఏటీఎంలు

8/11 తర్వాత దేశంలోని సగం ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. కొన్ని ఏటీఎంలు కొత్తనోట్ల పంపిణీకి అనుగుణంగా పునరుద్ధరించారు. బ్యాంకు సిబ్బంది, ఏటీఎంలలో డబ్బు నింపే ఏజెన్సీలు, ఏటీఎం వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులు కుమ్మక్కై ఏటీఎంలు కేంద్రంగా భారీగా నగదును అక్రమార్కుల పరం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఏదైనా ఏటీఎంలో నగదు అయిపోగానే సంబంధిత బ్యాంకుకు మెసేజ్ పంపుతుంది. వాటిని ఏజెన్సీ సిబ్బంది వచ్చి నింపాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల ఏటీఎంలో డబ్బు అయిపోయినట్టు మెసేజ్ రాగానే, ఏటీఎంలను షట్‌డౌన్ చేస్తున్నారు. వాటిల్లో నింపేందుకు కేటాయించిన డబ్బును నల్లకుబేరులకు అప్పగిస్తున్నారు.

ఉదాహరణ: ధనలక్ష్మి బ్యాంకుకు చెందిన రూ.1.30 కోట్లు ఇలా పక్కదారి పట్టినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. 32 ఏటీఎంలను స్వాధీనం చేసుకున్నారు.

3. జన్‌ ధన్ ఖాతాల దుర్వినియోగం

దేశవ్యాప్తంగా అన్నిచోట్లా జన్‌ ధన్ ఖాతాలు దుర్వినియోగం అవుతున్నాయని, కనీసం 15 శాతం ఖాతాలు నల్లధన మార్పిడికి సహాయపడుతున్నాయని అధికారులు తెలిపారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత ఆయా ఖాతాల్లో భారీగా సొమ్ము జమ అవుతున్నదని గుర్తించారు. ఆ తర్వాత ఆ సొమ్మంతా ఇతర ఖాతాలకు బదిలీ అవుతున్నదని తేల్చారు. సీబీఐ ప్రస్తుతం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఉదాహరణ: జన్‌ ధన్ ఖాతా 3370263079లో నవంబర్ 13న 2.3లక్షలు డిపాజిట్ అయ్యాయి. అదేరోజు ఆ సొమ్ము మొత్తం ఓంకార్ పిరమల్ మందిర్‌ కు చెందిన సెంట్రల్ బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి.

4. డిమాండ్ డ్రాఫ్ట్‌ ల నాటకం

అక్రమార్కులు ముందుగా పాత నోట్లతో డీడీలు తీస్తారు, ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేసి ఆ మొత్తానికి కొత్తనోట్లను తీసుకుంటారు. నిబంధనల ప్రకారం రూ.49,000 లోపు డీడీలను రద్దు చేసుకుంటే ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని ఆధారంగా వందల సంఖ్యలో డీడీలు తీసి క్యాన్సిల్ చేశారు.

ఉదాహరణ: కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యాపారులు గోపాల్ - అశ్విన్ జీ సుంకు బసవనగుడి ప్రాంతంలో ఉన్న సెంట్రల్ బ్యాంకు శాఖలో రూ.71,49,000 విలువ చేసే 149 డీడీలను తీశారు. ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేసి కొత్తనోట్లను తీసుకున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.

5. క్యాషియర్ల కమీషన్ కక్కుర్తి

కొందరు క్యాషియర్లు ఐడీ ప్రూఫ్స్ తీసుకోకుండానే నగదు మార్పిడి చేస్తున్నారు. తద్వారా వచ్చిన పాతనోట్లను అప్పటికే బ్యాంకులో నిల్వ ఉన్నవాటిగా లెక్కల్లో చూపిస్తున్నారు. ఇందుకు 25 శాతం కమిషన్ తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి.

ఉదాహరణ: ఆర్బీఐ అధికారి మైఖేల్ అరెస్టు ఇలాంటి అవకతవకల నేపథ్యంలోనే జ‌రిగింది.

6. నకిలీ ఖాతాలు తెరువడం

నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చేవారు సమర్పించే ధ్రువపత్రాలు ఉపయోగించి కొందరు బ్యాంకు సిబ్బంది కొత్త ఖాతాలను తెరుస్తున్నారు. నల్లధనాన్ని అందులో జమ చేసి అందులో నుంచి అధికారికంగా విత్‌ డ్రా చేస్తున్నారు. వాటిల్లో కనీస నిల్వ కూడా ఉంచడం లేదు.

ఉదాహరణ: నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తెరిచి, కొన్ని లావాదేవీలకే పరిమితమైన ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.

7. మహిళా సంఘాలు - సహకార బ్యాంకులు

కొందరు అక్రమార్కులు తమ సొమ్మును మహిళా సంఘాల ఖాతాల్లో, కొన్ని సహకార సంఘాల్లో జమ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కంప్యూటరైజ్డ్ కాని బ్యాంకుల్లో పాత తేదీలతో డిపాజిట్లు చేస్తున్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలోనే సహకార బ్యాంకుల్లో నగదు మార్పిడి/జమను ఆర్బీఐ నిషేధించింది. కొందరు మైక్రోఫైనాన్స్ ఏజెంట్లు వ్యాపారుల వద్ద నుంచి కొత్తనోట్లను సేకరించి - కమీషన్‌ పై అవినీతిపరుల నుంచి పాత నోట్లను మార్పిడి చేసి మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేస్తున్నట్టు గుర్తించారు.

ఉదాహరణ: దేశవ్యాప్తంగా దాదాపు 5000 ఎస్‌ హెచ్‌ జీ ఖాతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/