Begin typing your search above and press return to search.

రైతులకు విలన్లుగా మారిన బ్యాంకులు

By:  Tupaki Desk   |   31 Dec 2015 5:30 PM GMT
రైతులకు విలన్లుగా మారిన బ్యాంకులు
X
తెలుగు రాష్ట్రాల్లో రైతులకు బ్యాంకులు విలన్లుగా మారాయి. వారికి అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అటు అప్పు దొరక్క ఇటు ప్రభుత్వ సాయం లేక రైతుల విలవిలలాడిపోతున్నారు. ఇక్కడ పూర్తి తప్పిదం బ్యాంకులదేనా అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వాలు అమలు చేసిన రుణ మాఫీ పథకం కారణంగా రైతులకు బ్యాంకులు దూరమయ్యాయి.

గతంలో బ్యాంకులు రైతులకు అప్పులు ఇచ్చేవి. ఒక్క స్టేట్ బ్యాంకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్సు అమలు చేసేది. మిగిలిన బ్యాంకులు కాస్త ఉదారంగానే రుణాలు ఇచ్చేవి. ఆయా అప్పులను తీర్చి కానీ తిరిగవేసుకుని కానీ రైతులు మళ్లీ రుణాలు తీసుకునేవాళ్లు. అందుకే గతంలో పెద్దగా బ్యాంకుల నుంచి సమస్యలు రాలేదు. కానీ,

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు లక్షన్నర వరకు రుణ మాఫీ అమలు చేశారు. దానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను ఒక ప్రాతిపదికగా పెట్టారు. రైతుల్లో చాలామందిని అనర్హులుగా తేల్చారు. రుణ మాఫీ అమలుకు ఒక ఏడాది ఆలస్యం చేశారు. ఈ మూడు కారణాలతో గతంలో ఉదారంగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు కూడా ఇప్పుడు రైతుల ముఖం చూడడం లేదు. వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని కొందరు ఇస్తుంటే మిగిలిన వాళ్లు ఆ రుణం కూడా ఇవ్వడం లేదు.

తెలంగాణలో ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణ మాఫీని అమలుచేసింది. దానిని కూడా నాలుగు విడతలుగా అమలు చేస్తామని ప్రకటించింది. దాంతో నాలుగు విడతల రుణ మాఫీ పూర్తయ్యే వరకూ తిరిగి రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మొదటి విడత రుణ మాఫీని వడ్డీ కింద జమ చేసుకున్నాయి. రెండో విడత రుణ మాఫీలో సగం వడ్డీకి పోతే మిగిలిన సగానికి రుణం ఇస్తానన్నాయి. కానీ ఐదు, పది వేలతో చేసుకునేది ఏముంటుంది? దాంతో తెలంగాణలో రైతులు రుణాలకు పూర్తిగా దూరమయ్యారు.

ప్రభుత్వాలు అమలు చేసిన రుణ మాఫీ పథకంతో రైతులకు ఏకంగా రుణాలే మాఫీ అయ్యాయి. రైతు ఆత్మహత్యలకు ఇది కూడా ఒక కారణం.