Begin typing your search above and press return to search.

వరుడి కట్నం దాహం.. పెళ్లిపీటలపై చావబాదారు

By:  Tupaki Desk   |   9 Dec 2019 1:21 PM GMT
వరుడి కట్నం దాహం.. పెళ్లిపీటలపై చావబాదారు
X
భారీగా కట్నాలు తీసుకొని మోసం చేస్తున్న ఓ బ్యాంక్ మేనేజర్ బండారం బట్టబయలు అయ్యింది. తిరుపతిలో ఎస్బీఐ మేనేజర్ గా చేస్తున్న మోహన కృష్ణ తాజాగా ఒక మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ అమ్మాయితో పెళ్లి కుదుర్చుకొని ఏకంగా 16 లక్షల కట్నం - 6 తులాల బంగారం కట్నంగా పొందాడు. తీరా నిశ్చితార్థం తర్వాత జాతకాలు కుదరడం లేదని పెళ్లికి నిరాకరించాడు. దీంతో తమ 16 లక్షలు - 6 తులాల బంగారం ఇవ్వమని వధువు తరుఫు వారు కోరినా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు.

ఇదే క్రమంలో నంద్యాలకు చెందిన మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు ఎస్బీఐ మేనేజర్ మోహన్ కృష్ణ. వారి నుంచి కూడా రూ.10లక్షల కట్నం - 12 తులాల బంగారం - రెండు భవనాలను కట్నంగా తీసుకున్నాడు. తీరా తాళి కట్టబోతుండగా ట్విస్ట్ నెలకొంది.

మొదటి సంబంధం తరుఫు అమ్మాయి బంధువులు పెళ్లి మండపంలోకి వచ్చి వరుడిగా తాళి కట్టడానికి రెడీ అయిన పెళ్లికొడుకు మోహనకృష్ణను చితకబాదడం మొదలుపెట్టారు. తమ ఆడకూతురును మోసం చేసి కట్నం తీసుకొని ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుంటావా అని కొట్టడం మొదలుపెట్టారు. ఏమవుతుందో తెలియని పెళ్లికి వచ్చిన వారు అలానే చూస్తుండిపోయారు. ఇక మోహనకృష్ణ బంధువులు కూడా మొదటి సంబంధం తరుఫు వాళ్లపై ఎదురుదాడి చేశాడు. ఈ విషయం రచ్చ కావడం.. పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగిపోయింది.

ఆరాతీయగా మోహనకృష్ణ బండారం అదే పెళ్లిమంటపంలో బయటపడింది. మొదటి వధువు వద్ద 16 లక్షలు, బంగారం తీసుకొని మోసం చేశాడని తెలుసుకున్న రెండో సంబంధం వారు కూడా పెళ్లిని రద్దు చేసుకున్నారు. తమ నుంచి తీసుకున్న రూ.10లక్షల కట్నం -12 తులాల బంగారం - రెండు భవనాలను వెంటనే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఇరువురు ఫిర్యాదు చేశారు.

ఇలా మోహనకృష్ణ అనే కట్న పిపాసి చివరకు పెళ్లికి నోచుకోకుండా కటకటాల పాలయ్యాడు. ఇది వరకు కూడా మనోడు నంద్యాల కెనరా బ్యాంక్ మేనేజర్ గా ఉండగా నిరుద్యోగుల నుంచి లక్షల వసూలు చేసి వ్యాపారం పేరిట మోసం చేశాడని కేసులు నమోదయ్యాయి. తాజాగా పెళ్లి ఉందంతంలో ఇద్దరు వధువులను మోసం చేసింనందుకు జైలు పాలయ్యాడు.