Begin typing your search above and press return to search.

ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులో ఉరి వేసుకున్న బ్యాంక్ మేనేజర్

By:  Tupaki Desk   |   12 April 2021 2:30 AM GMT
ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులో ఉరి వేసుకున్న బ్యాంక్ మేనేజర్
X
ప్రపంచంలో అత్యంత కులాసా ఉద్యోగం ఏదని అడిగితే.. అయితే ప్రభుత్వ పాఠశాలలో టీచర్.. లేదంటే ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగిగా చెబుతారు. మరి.. అలాంటిది ఒక మహిళా బ్యాంకు మేనేజర్.. బ్యాంకులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కేరళలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కన్నూరు పరిధిలోని తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకులో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతంలోకి వెళితే.. 38 ఏళ్ల స్వప్న కెనరా బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు బ్యాంకుకు వచ్చిన ఆమె.. ఆఫీసులోని తన ఛాంబర్ లోకి వెళ్లినంతనే ఉరి వేసుకుంటూ కనిపించటంతో వెంటనే స్పందించిన సిబ్బంది బ్యాంకు అలారం నొక్కారు. ఆ వెంటనే సిబ్బంది.. స్థానిక ప్రజలు కలిసి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఇంత ప్రయత్నం చేసినా.. ఆమెను రక్షించుకోలేకపోయారు. డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. బ్యాంకులోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. ఆమె రాసుకున్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. కన్నూరులో ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న ఆమెది త్రిసూర్ జిల్లాలోని మన్నూతి సొంతూరుగా చెబుతున్నారు. 2020 సెప్టెంబరు నుంచి ఆమె ఈ బ్రాంచ్ లో పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.