Begin typing your search above and press return to search.

పోలీసులపై ఉద్దేశపూర్వకంగానే ఆలా చేసాం .. 'బంజారాహిల్స్‌ బాధితులు'

By:  Tupaki Desk   |   19 Dec 2019 6:13 AM GMT
పోలీసులపై ఉద్దేశపూర్వకంగానే ఆలా చేసాం .. బంజారాహిల్స్‌ బాధితులు
X
రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు నా భార్యపై అత్యాచారయత్నం చేశారు... నా ఎదుటే నా భర్తను విచక్షణా రహితంగా కొట్టారు... అంటూ బంజారాహిల్స్‌ పోలీసులపై వీడియోల ద్వారా తీవ్ర ఆరోపణలు చేసిన ‘బాధితులు’ అట్లూరి సురేష్‌కుమార్, అట్లూరి ప్రవిజ అసలు విషయం తాజాగా బయటపెట్టారు. మేము ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై ఆరోపణలతో కూడిన వీడియో రూపొందించామని మరో వీడియో విడుదల చేశారు. సురేష్‌ నేరచరిత్రను హైదరాబాద్‌ పోలీసులు తవ్వుతున్న నేపథ్యంలోనే వీరు తప్పు ఒప్పుకున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

పూర్తి వివరాలు చూస్తే ... సురేష్‌కుమార్‌ గతంలో విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండేవాడు. అప్పట్లో సన్‌ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ , నిరుద్యోగులకు ఎర వేసి డబ్బు దండుకుని మోసం చేయడంతో ఎనిమిది కేసులు ఇతని పై నమోదయ్యాయి. 2007లో ఆయా కేసుల్లో ఇతడికి మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించి బెయిల్‌ పై బయటకి వచ్చాడు.

ఆ తరువాత హైదరాబాద్‌కు వచ్చిన సురేష్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌ పరిధిలో ఓ స్థలం లీజుకు తీసుకుని గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టడంతో గత మార్చిలో జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.13లోని అడ్రస్‌ ఇన్‌ హోటల్‌లో రెస్టారెంట్‌ నిర్వహణ కోసం గతంలో దాని యజమాని వాసుదేవశర్మతో ఒప్పందం చేసుకున్నారు. రెస్టారెంట్, కిచెన్‌ అభివృద్ధి పేరుతో ఆయన నుంచి రూ.4.72 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో బాధితుడు మే నెల్లో బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై వాసుదేవ శర్మ కోర్టును ఆశ్రయించగా సురేష్‌కు సమన్లు జారీ అయ్యాయి. వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించిన సురేష్‌ ఉద్దేశపూర్వకంగా వాసుదేవ శర్మపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. దీన్ని తీసుకోవడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో వారితో దురుసుగా ప్రవర్తించడంతో సురేష్‌ పైనే కేసు నమోదైంది.

ఈ కేసులో అరెస్టు అయిన భార్యభర్తలు బెయిల్‌ పై బయటకి వచ్చి రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు స్టేషన్‌లోనే అత్యాచార యత్నం జరిగిందని, తమను దారుణంగా హింసించారని ఇరువురూ దాదాపు 15 నిమిషాల నిడివితో కూడిన వీడియో తీసి యూట్యూబ్‌ లో పెట్టారు. దీనితో ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీయడంతో పాటు సురేష్‌ గతాన్ని తవ్వితీశారు. దీంతో మెట్టు దిగిన బాధితులు అసలు విషయం అంగీకరిస్తూ బుధవారం 1.5 నిడివితో మరో వీడియో విడుదల చేశారు.