Begin typing your search above and press return to search.

క్వారంటైన్‌ లో కేసీఆర్‌...ఇప్ప‌డే కాదు చాలా రోజులుగా!

By:  Tupaki Desk   |   8 May 2020 4:00 PM GMT
క్వారంటైన్‌ లో కేసీఆర్‌...ఇప్ప‌డే కాదు చాలా రోజులుగా!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గ‌త కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న‌ కరీంనగర్ ఎంపీ - తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా మ‌రోమారు మండిపడ్డారు. ప్రజలను-రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ లో క‌రోనా కేసులు పెరిగాయని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ క్వారంటైన్‌ లో ఉన్నారని... పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో నుంచి బయటకురారని విమర్శించారు. జోకర్ ముఖ్యమంత్రి, క్వారంటైన్ ముఖ్యమంత్రి అన్న పేరు కేసీఆర్‌ కి కరెక్ట్‌ గా సెట్ అవుతుందని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 6 సంవత్సరాలుగా క్వారంటైన్‌ లోనే ఉన్నారని.. అప్పుడప్పుడు బయటకి వస్తారని, -ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడతారని విరుచుకుప‌డ్డారు.

క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌ను గుర్తించేందుకు టెస్టులు జరగాలని కేంద్రం అంటుంటే కేసీఆర్ టెస్టులను తగ్గించారని సంజ‌య్ ఆరోపించారు. లాక్ డౌన్‌ లో రోడ్ల మీద బరితెగించి తిరుగుతున్న వారి కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. పాతబస్తీలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేయడం దురదృష్టకరమని సంజ‌య్ అన్నారు. బాలికపై అత్యాచారం చేసిన ఎంఐఎం గుండాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు, రేపిస్ట్ లకు అడ్డాగా ఓల్డ్ సిటీని మార్చిన ఎంఐఎంకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందన్నారు.

ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అగ్రికల్చర్ బులిటెన్ విడుదల చేస్తున్నాయని.. మరి తెలంగాణ సర్కార్ ఎందుకు చేయడం లేదని బండి సంజ‌య్ ప్రశ్నించారు. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తా అన్న సీఎం ఇప్పటి వరకు 20 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని ఆయ‌న అన్నారు. దేశంలో 17 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో ర‌కంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని.. తెలంగాణ సీఎం మాత్రం త‌మ ప్ర‌భుత్వం ధాన్యం సేక‌రించ‌కుంటే ప‌రిస్థితి ఏంట‌ని రైతుల‌ని బెదిరిస్తున్నార‌ని సంజ‌య్ అన్నారు. సీఎం రైతులను అవమానిస్తున్నారని ఆయ‌న అన్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో‌ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వర్తిత్వం మాత్రమే వ్యవహరిస్తుంద‌ని , ఒక్క‌ రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. గన్ని బస్తాలు, రవాణా చార్జీలు ఇలా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని ఆయ‌న అన్నారు. అధికారుల ద్వారా సీఎం రైతుల ను బెదిరిస్తున్నారని…రాష్ట్ర ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే ఆయ‌న చేసేది బ్రోకరిజం అని అన్నారు. కేంద్ర నిధుల మీద ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.