Begin typing your search above and press return to search.

'మసీదులు తవ్వేందుకు సిద్దమా?'.. అసద్ కు బండి సవాల్

By:  Tupaki Desk   |   26 May 2022 3:15 AM GMT
మసీదులు తవ్వేందుకు సిద్దమా?.. అసద్ కు బండి సవాల్
X
సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న ఆయన.. గతంలో ఎప్పుడూ చేయని రీతిలో కొత్త తరహాలో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న కొద్ది గంటల ముందు జరిగిన ఈ సభలో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా చేసింది.

చూస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫాలో అయ్యే రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందన్న శాంపిల్ చిత్రాన్ని బండి సంజయ్ తన మాటలతో స్పష్టం చేశారన్న అభిప్రాయం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ‘తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి’ అంటూ ఆయన నోటి వచ్చిన వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త తరహా రాజకీయాలకు తెర తీయనుందన్న వాదన వినిపిస్తోంది.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సవాలు విసిరే క్రమంలో బండి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘‘దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారు. ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి. కాశీలోని మసీదులోనూ ఇదే జరిగింది. తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి. ఆ తవ్వకాల్లో శివలింగం కనిపిస్తే ఆ ప్రాంతం మాది (హిందువులది). శవాలు కనిపిస్తే మీది (ముస్లింలది).

మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా? తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతాం. లవ్‌ జిహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తాం. మత మార్పిడిలు చేస్తే మక్కెలిరగదీస్తాం. రాష్ట్రంలోని మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి. వాటికి కంప్యూటర్లు అందజేసి ఆర్థిక సహాయం చేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం’’ అంటూ తమ ఎజెండాను ప్రకటించారు.

కరీంనగర్‌ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా.. వేములవాడ రాజన్న గుడిలోని దర్గా తొలగించబడాలన్నా రామరాజ్యం రావల్సిందేనన్న బండి సంజయ్ మరో సంచలన అంశాన్ని ప్రస్తావించారు. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్‌ సినిమా రాబోతోందది. రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజలకు చూపిస్తామన్నారు. నిజాయితీగా.. నిబద్ధతతో పని చేస్తున్న తనపై కొందరు అవాకులు.. చవాకులు పేలుతున్నారని.. తనను ఎంపీగా గెలిపించిన హిందువుల కోసం యుద్ధం చేసే అవకాశం వచ్చిందన్నారు. తనను విమర్శించొద్దన్న ఆయన.. భారత్ - పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ వేళ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని.. మతమార్పిడులు చేసిన వారిని తరిమికొట్టానన్నారు.

కరీంనగర్ నడి రోడ్డు మీద ఉన్న ఈద్గాను తొలగించేందుకు పోరాడి జైలుకు వెళ్లినట్లు చెప్పిన బండి సంజయ్.. తనను మూడుసార్లు చంపాలని ప్రయత్నించారన్నారు. అయినప్పటికి తాను కాషాయం జెండాను వీడలేదని.. కరీంనగర్ గడ్డను విడిచి పెట్టలేదన్నారు. ‘‘కరీంనగర్‌ బస్టాండ్‌లో, కోరుట్లలో, జగిత్యాలలో, లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌లలో, సాయిబాబా గుడిలో బాంబులు పెట్టి అమయాకుల ప్రాణాలు తీసింది మీరు కాదా? వరంగల్‌లో పూజారిని, నాగరాజును హత్యచేసింది మీరు కాదా’’ అంటూ మండిపడ్డారు. ఏ హిందువుకు కష్టం వచ్చినా హనుమంతుడి భక్తుడిగా, ఛత్రపతి శివాజీ వారసుడిగా, పెద్దన్నగా వారికి అండగా ఉంటానన్నారు. తనతో కలిసి పోరాడేందుకు యువత ముందుకు రావాలని కోరారు. మంట పుట్టించేలా మారిన బండి సంజయ్ మాటలు ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపేలా ఉన్నాయని చెప్పక తప్పదు.