Begin typing your search above and press return to search.

నాటి ఫోటో బయటపెట్టిన బండి సంజయ్

By:  Tupaki Desk   |   10 Nov 2019 8:15 AM GMT
నాటి ఫోటో బయటపెట్టిన బండి సంజయ్
X
సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ బండి సంజయ్ పేరు తెలుగు ప్రజలకు పెద్ద పరిచయం కాదు. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిచయమైన పేరు.. 2019 ఎంపీ ఎన్నికల పుణ్యమా అని ఫేమస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అడ్డా లాంటి కరీంనగర్ ఎంపీ సీటును సొంతం చేసుకోవటం ద్వారా బండి సంజయ్ పాపులర్ అయిపోయారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా అభివర్ణించే ఆయన బ్యాక్ గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ అన్న విషయాన్ని తెలిపే ఫోటోను తాజాగా ఆయన బయటపెట్టారు.

అయోధ్య వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు చారిత్మాత్మక తీర్పు వెల్లడించిన వేళ.. ఎంపీ బండి సంజయ్ పాత విషయాల్ని గుర్తుకు తెచ్చే ఫోటోను షేర్ చేసుకున్నారు. 1992లో అయోధ్యకు బయలుదేరిన మొట్టమొదటి కరసేవకుల బృందంలో తానొక సభ్యుడినని చెప్పారు.
అప్పట్లో కరీంనగర్ నుంచే మొట్టమొదటి కరసేవకుల బృందం అయోధ్యకు బయలుదేరి వెళ్లిందని చెప్పిన ఆయన.. అందుకు కారణాన్ని చెప్పారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సొంత జిల్లా కరీంనగర్ కావటంతో ఇక్కడి నుంచే కార్యకర్తలు మొదటగా బయలుదేరాలని పార్టీ నాయకత్వం చెప్పటంతో పదిహేను మందితో కూడిన బృందం అయోధ్యకు వెళ్లినట్లు చెప్పారు.

అయోధ్యకు వెళ్లిన తర్వాత తొలి నాలుగు రోజులు చాయ్ బిస్కెట్లతో కడుపు నింపుకున్న విషయాన్ని బండి సంజయ్ గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా కార్యకర్తలు తరలిరావటంతో భోజన ఏర్పాట్లు చేశారన్న బండి సంజయ్.. నాటి ఫోటోను షేర్ చేశారు.