Begin typing your search above and press return to search.

బహిరంగ ప్రదేశాల్లో మాంసాహార అమ్మకాలపై నిషేధం !

By:  Tupaki Desk   |   15 Nov 2021 5:11 AM GMT
బహిరంగ ప్రదేశాల్లో మాంసాహార అమ్మకాలపై నిషేధం !
X
రోడ్ల పై, బహిరంగ ప్రదేశాల్లో నాన్ వెజ్ వెరైటీల అమ్మకాలపై గుజరాత్ లోని రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో బహిరంగ మాంసాహారాల అమ్మకాల వల్ల పౌరుల మతపరమైన మనోభావాలు దెబ్బతింటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని నగర మేయర్ డా. ప్రదీప్ దేవ్ తెలిపారు. వీధి వ్యాపారులు మాంసాహార ఆహారాన్ని బహిరంగంగా అమ్మడం వల్ల పౌరుల మతపరమైన మనోభావాలు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ కారణంగానే నిషేధం విధించాము. నగర శివార్లలో లేదా మతపరమైన ప్రదేశాలకు దూరంగా మాంసాహార అమ్మకాలకు స్థలాన్ని కేటాయిస్తామని రాజ్కోట్ మేయర్ చెప్పుకొచ్చారు.

వడోదర, సూరత్, భావ్ నగర్, జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లు కూడా త్వరలో ఈ నిబంధనలు అమలు చేస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోనూ వీధుల్లో మాంసాహార అమ్మకాలను నిషేధించవచ్చని తెలుస్తోంది. ఈ నిషేధం పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. గుజరాత్ లో పెరిగిపోతున్న నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని విమర్శించింది. ఉద్యోగ కల్పన లేకుండా ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లు ఆరోపించింది. జీవనోపాధి కోసం యువత చిన్న స్టాళ్లలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. అవి కూడా ఖాళీ చేయించడం అన్యాయం. దోపిడీయే భాజపా అతిపెద్ద ఆదాయం.

ఈ వీధి వ్యాపారుల నుంచి పెద్ద మొత్తాల్లో వసూలు చేయాలని భావిస్తోంది. ఉద్యోగ కల్పనను ప్రజలు ఆశిస్తున్నారు. వీధి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సమస్యను దారితప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీధి వ్యాపారులు నాన్ వెజ్ వెరైటీ లను బయటకు కనిపించేలా విక్రయానికి ఉంచడంపై గుజరాత్ లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆహార పదార్థాలను సరిగ్గా కప్పి ఉంచాలని నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డు పై వెళ్లే వారికి మాంసాహారం కనిపించకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది.