Begin typing your search above and press return to search.

భారత్‌ పై ప్రేమని చాటుకున్న బాన్‌ కీ మూన్ .. ఏంచెప్పారంటే ?

By:  Tupaki Desk   |   22 Nov 2021 11:30 PM GMT
భారత్‌ పై ప్రేమని చాటుకున్న బాన్‌ కీ మూన్ .. ఏంచెప్పారంటే ?
X
ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్‌ కీ మూన్ తన ఆత్మకథలో కీలక విషయాలను వెల్లడించారు. తన హృదయం భారత్‌ తో పెనవేసుకొని ఉన్నదని తెలిపారు. తన హృదయంలోని సగభాగం భారత్ కే చెందుతుందటూ బాన్‌ కీమూన్ వెల్లడించారు. దక్షిణ కొరియాకు చెందిన బాన్‌ కీ మూన్ దౌత్యవేత్తగా తన మొదటి పోస్టింగ్‌ ను భారత్‌ లోనే ప్రారంభించారు. దౌత్యవేత్తగా ఉన్న సమయలో భారత్‌ తో ప్రత్యేక సంబంధాన్ని అలవర్చుకున్నారు. ఆ మూడేళ్లు తనకు అద్భుతంగా గడిచినట్లు బాన్ కీ మూన్ తెలిపారు.

తన జీవితంలో చాలా కీలక సమయమని వెల్లడించారు. తన ఆత్మకథ రిసాల్వ్‌డ్: యునైటింగ్ నేషన్స్ ఇన్ డివైడెడ్ వరల్డ్ లో బాన్ కీ మూన్ తన 50 ఏళ్లనాటి జీవితానికి గురించిన ఆసక్తికర విషయాలను తెలియజేశారు. బాన్ కీ మూన్, ఐక్య రాజ్య సమితి ఏర్పాటుకు ఓ ఏడాది ముందు 1944లో జన్మించారు. బాన్ బాల్యం మొత్తం ఉభయ కొరియాల యుద్ధం మధ్య గడిచింది. తన గ్రామంపైనా బాంబులు పడిన ఘటనలు, రోదనలు ఆయన జీవిత కాలమంతా వెంటాడినట్లు పేర్కొన్నారు. తన కుటుంబం సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లే సమయంలో బాన్ ఆరేళ్ల బాలుడు. బురద నీటిలో నడుస్తూ, ఆకలితో బాధపడుతూ, చావుబతుకుల మధ్య పయనమయ్యారు. అలాంటి భయంకర వాతావరణం మధ్య గడిచిన రోజులు ఆయన్ని శాంతిదూతగా మార్చాయని తెలిపారు.

1972, అక్టోబర్‌ లో కుటుంబంతో ఢిల్లీకి చేరుకున్న బాన్ కీ మూన్ మూడేళ్లపాటు వివిధ హోదాల్లో దౌత్యాధికారిగా సేవలు అందించారు. మొదట కొరియన్ కాన్సులేట్ జనరల్‌ కి వైస్ కాన్సల్‌ గా పనిచేశారు. 1973లో కొరియా, భారతదేశం మధ్య పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత సెక్రటరీగా పనిచేశారు. ఈ సమయంలో తన కుమార్తె సియోన్‌ యాంగ్‌ కు అప్పుడు 8 నెలలని ఆయన తెలిపారు. తన కుమారుడు వూ హ్యున్ 1974, అక్టోబర్ 30న ఇక్కడే జన్మించారంటూ గుర్తు చేశారు. తన చిన్న కూతురు హ్యూన్‌ హీ, భారతీయుడిని పెళ్లాడిందని ఆయన ఆత్మకథలో తెలిపారు.

అందుకే 50 ఏళ్ల తర్వాత కూడా తన హృదయంలోని సగభాగం భారత్ తో పెనవేసుకోని ఉందని.. భారత ప్రజలకు సగర్వంగా చెబుతున్నట్లు బాన్ కీ మూన్ తెలిపారు. కాగా,బాన్ కీమూన్,2006లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రపంచ లోని పేదరికం, వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక దృష్టిసారించి.. చరిత్రలో నిలిచిపోయేవిధంగా నిర్ణయాలు తీసుకున్నారు. బాన్ కీ మూన్ పోటీగా శశి థరూర్ కూడా నిలిచారు. కాగా ఆయన రెండో స్థానంలో నిలవడంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.