Begin typing your search above and press return to search.

హిందూపురం కోసం బాల‌య్య దీక్ష‌.. ప్ర‌భుత్వం రియాక్ష‌న్ ఏంటి?

By:  Tupaki Desk   |   4 Feb 2022 6:34 AM GMT
హిందూపురం కోసం బాల‌య్య దీక్ష‌.. ప్ర‌భుత్వం రియాక్ష‌న్ ఏంటి?
X
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు ఆందోళనలు మరోవైపు మద్దతుగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. అయితే.. అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా జిల్లాల ఏర్పాటు విష‌యంలో రంగంలోకి దిగారు. అనంత‌పురాన్ని విడ‌దీస్తూ.. కొత్తగా ప్రకటించిన శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని కేంద్రంగా చేయాలంటూ పోరాట బాట పట్టారు. ఇప్ప‌టికే ఇక్క‌డి ప్ర‌జ‌లు వివిద రూపాల్లో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్లుగా బాల‌య్య‌ను కూడా రంగంలోకి దిగాలంటూ.. డిమాండ్లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం... బాల‌య్య స్థానిక‌ అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్షలో కూర్చున్నారు.. కొత్త జిల్లాల ప్రతిపాదనలు ప్రకటించిన వెంటనే బాలకృష్ణ హిందూపురాన్ని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మౌనదీక్షకు దిగుతున్నారు. అనంత పురం జిల్లాను రెండుగా విభజించి శ్రీత్యసాయి జిల్లాను ప్రతిపాదించిన విష‌యం తెలిసిందే. హిందూపు రం పార్లమెంట్ స్థానంలోని ప్రాంతాలను ఈ జిల్లా పరిధిలోకి తెచ్చారు.

అయితే... హిందూపురాన్ని ఏకంగా ఒక జిల్లా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాగా ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే అందుకు విరుద్దంగా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రతిపాదించారు. దీంతో హిందూపురం వాసుల్లో ఆందోళన మొదలైంది. పార్లమెంట్ సెగ్మెంట్ హిందూపురం కాకుండా పుట్టపర్తిని ప్రకటించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ర్యాలీలు, నిరసనలు, బంద్‌లతో తమ డిమాండ్ వినిపించారు. జిల్లాల ప్రకటన విషయంలో హిందూపురంకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్నారు.

అటు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామ‌ని, అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాల‌య్య కూడా గ‌తంలోనే డిమాండ్ చేశారు అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా కూడా హిందూపురం అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందేనని బాలకృష్ణ వెల్లడించారు.

జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయన్నారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి వారి చిరకాల కోరిక అయిన హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా బాల‌య్య‌.. మౌన దీక్ష చేస్తున్నారు. మ‌రి ఈ దీక్ష ప్ర‌భావం ఎంత వ‌ర‌కు వుంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది. సీఎం జ‌గ‌న్.. సినిమాల ప‌రంగా.. బాల‌య్య‌కు అభిమాని కూడా అయిన నేప‌థ్యంలో జ‌గ‌న్ స్పందిస్తారా? లేదా? అనేది చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.