Begin typing your search above and press return to search.

తెలుగు ప్రజలకు సరికొత్త పాఠాన్ని నేర్పిన నందమూరి ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   16 Jan 2022 4:50 AM GMT
తెలుగు ప్రజలకు సరికొత్త పాఠాన్ని నేర్పిన నందమూరి ఫ్యామిలీ
X
రాజకీయం వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరన్న విషయాన్ని ఇప్పటి తరం మరచిపోయి చాలా కాలమే అయ్యింది. రాజకీయంగా వైరం మొదలైతే.. రక్త సంబంధీకులు సైతం ముఖం ముఖం చూసుకోవటానికి ఇష్టపడని పరిస్థితి. అందుకు భిన్నంగా భిన్నధ్రువాలైన పార్టీల్లో ఉంటూ కూడా.. రాజకీయం వేరు.. కుటుంబం వేరు అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసింది నందమూరి కుటుంబం.

రాజకీయంగా చూసినప్పుడు బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీలో ఉండటం తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ఆయన సోదరి పురంధేశ్వరి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీల పరంగా చూస్తే.. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడెలాంటి సంబంధం లేకపోగా.. శత్రుత్వం ఉందనే చెప్పాలి. అన్నింటికి మించి బాలయ్య బావ కమ్ వియ్యంకుడైన చంద్రబాబుకు.. తన సోదరి పురంధేశ్వరి కుటుంబానికి సరైన టర్మ్స్ లేవన్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయంగా వీరి మధ్య ఎంతటి శత్రుత్వం ఉన్నా.. ఇంటి విషయానికి వచ్చేసరికి మాత్రం.. వాటిని పక్కన పెట్టి హాజరవుతుంటారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ఇంట్లో వేర్వేరు పార్టీలను అభిమానించే వారు.. ఎవరి జెండాను వారు పట్టుకోవటంతప్పు లేదు. కానీ..వ్యక్తిగత బంధాల్ని సైతం బోడి రాజకీయం కోసం పణంగా పెట్టే కుటుంబాలు తెలుగు నేతల మీద లక్షల్లో కనిపిస్తాయి. అలాంటి వారికి బుద్ధి చెప్పేలా.. రాజకీయం వేరు.. కుటుంబ అనుబంధాలు వేరన్న విషయాన్ని నందమూరి కుటుంబం తాజాగా చాటి చెప్పిందని చెప్పాలి.

తన సోదరి పురంధేశ్వరితో రాజకీయంగా పొసగకపోయినా.. సంక్రాంతి పండక్కి వారింటికి రావటమే కాదు.. మూడు రోజులుగా అక్కడే ఉంటూ.. హ్యాపీగా గడిపిన తీరు చూసిన తర్వాత అయినా తెలుగు ప్రజలు రాజకీయం ఎంతైనా ఉండనివ్వండి.. అదంతా ఇంటి బయటే.. ఇంట్లో మాత్రం కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విలువైన సందేశాన్ని సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలకు నందమూరి కుటుంబం చాటి చెప్పిందని చెప్పాలి.