Begin typing your search above and press return to search.

ఈ లెక్కలే బాబాయ్.. అబ్బాయ్ లు కలిసిపోయేలా చేశాయా?

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:53 AM GMT
ఈ లెక్కలే బాబాయ్.. అబ్బాయ్ లు కలిసిపోయేలా చేశాయా?
X
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అప్పటివరకు రాసుకుపూసుకు తిరిగే వారు.. మరుక్షణంలో బద్ధ శత్రువుల మాదిరి మారిపోవటం రాజకీయాల్లో తరచూ చూసేదే. అలాంటి సీన్ ఒకటి తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఎర్రన్నాయుడు ఫ్యామిలీలో చోటు చేసుకుందని చెప్పాలి. మొదట్లో బాబాయ్.. అబ్బాయ్ అన్నట్లుగా కలిసికట్టుగా నడిచిన వ్యవహారం తర్వాతి రోజుల్లో లెక్కలు తేడా రావటం.. ఎవరి దారి వారు చూసుకోవటం తెలిసిందే.

ఒకప్పుడు ఒకే కుటుంబంగా ఉన్న వారు.. గడిచిన కొంతకాలంగా ఎవరి దారి వారిదన్నట్లుగా ఉండటం చూస్తున్నదే. ఒకే పార్టీలో ఉంటూ.. సమర్థులుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటూ కూడా.. ఇద్దరు ఒకే బాటలో నడవటానికి ఇష్టపడకపోవటం వారికే కాదు.. పార్టీకి కూడా నష్టం వాటిల్లేలా చేసిందని చెబుతారు. దివంగత నేత ఎర్రన్నాయుడి రాజకీయ వారసుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడేనన్న మాటే విభేదాలకు మొదటి అడుగుగా చెబుతారు. ఎందుకంటే.. అన్న తర్వాత తనదే అంతా అనుకున్న అచ్చెన్నాయుడికి.. అందుకు భిన్నంగా తన అన్న కొడుకు కుటుంబ రాజకీయ పగ్గాలు తీసుకోవటం నచ్చలేదంటారు.

అలా మొదలైన విభేదాలు.. తర్వాతి కాలంలో తన కొడుక్కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఎర్రన్నాయుడి సతీమణి చంద్రబాబును కోరటం మరింత పెరిగింది. కానీ.. వారి వినతిని పక్కన పెట్టిన బాబు.. అచ్చెన్నాయుడికి ఎమ్మెల్యే టికెట్.. రామ్మోహన్ నాయుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ గెలవగా.. పార్టీ మాత్రం ఓడింది. మరోవైపు బాబాయ్ అచ్చెన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక కాగా..తన వాక్ చాతుర్యంతో లోక్ సభలో అబ్బాయ్ తన సత్తా చాటుతూ.. ఏపీ ప్రయోజనాల గురించి దమ్ముగా మాట్లాడే నేతగా మారారు.

ఈ మధ్యన చోటుచేసుకున్న పరిణామాలతో పార్టీలో అచ్చెన్న ప్రాధాన్యత తగ్గిందన్న మాట వినిపిస్తున్నా.. అలాంటిదేమీ లేదన్న మాట పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో లెక్కలు తేడా ఉన్నప్పుడు.. తమకున్న బలం కాస్తా బలహీనతగా మారిపోతున్న విషయాన్ని గుర్తించిన బాబాయ్.. అబ్బాయ్ లుతాజాగా కలిసిపోయారంటున్నారు. ఇంతకాలం తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టేసిన వారు.. కలిసి ప్రయాణించాలని నిర్ణయించారట. జిల్లాలో కొత్త నేతలు వస్తుండటం.. తాము కలిసి ఉండకపోతే.. జిల్లాపై తమకున్న పట్టు తప్పి పోవటాన్ని గుర్తించిన వారు.. తామిద్దరం కలిసికట్టుగా ఉండాలని అప్పుడే తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత నిలుస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా కొంతకాలంగా విభేదాలతో దూరంగా ఉంటున్న బాబాయ్ అబ్బాయ్ లు తాజాగా మాత్రం కలిసిపోయారని చెప్పక తప్పదు.