Begin typing your search above and press return to search.

మంత్రి జయరాంపై మరో బాంబు పేల్చిన అయ్యన్న

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:30 PM GMT
మంత్రి జయరాంపై మరో బాంబు పేల్చిన అయ్యన్న
X
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఒకసారి మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారు బహుమతిగా అందిందంటూ అప్పట్లో ఆరోపించడం కలకలం రేపింది. ఈ ఆరోపణలను మంత్రి జయరాం ఖండించారు కూడా. తాజాగా మరో ఆరోపణను అయ్యన్న పాత్రుడు చేశాడు.

కర్నూలు జిల్లాలో ఏపీ మంత్రి జయరాం నాలుగు వందల ఎకరాలను తన కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో సొంత దారుల నుంచి బెదిరించి లాక్కున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన కొన్ని పత్రాలు బయటపెట్టారు.

మంత్రి అయ్యాక జయరాం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అయ్యన్న ఆరోపించారు. ఆ భూములన్నీ ఎక్కువగా ప్లాటినా అనే కంపెనీకి సంబంధించినవి అన్నారు. మరికొన్ని రైతులవని పత్రాలు చూపించారు. ఇద్దరు సోదరుల భార్యలపైన రెండు వందల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. మిగతావి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని అయ్యన్న రిజిస్ట్రేషన్ పత్రాలను మీడియాకు ముందు చూపించి విమర్శించారు.

కొన్ని భూములను ప్లాటినా అనే కంపెనీ నుంచి కొనుగోలు చేశారని అయ్యన్న ఆరోపించారు. సేల్ డీడ్ లో చిత్రమైన విషయాలు ఉన్నాయని వివరించారు. నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ జరగలేదన్నారు. రెండు లక్షలకు మించి నగదు వ్యవహారం జరగకూడదని.. రూ.52 లక్షల రూపాయలు సేల్ డీడ్ ఎలా నగదుగా మార్చారని అయ్యన్న ప్రశ్నించారు.