Begin typing your search above and press return to search.

వైసీపీ వితండం.. దస్తగిరి వాంగ్మూలంపై పదే పదే సెల్ఫ్ గోల్ !

By:  Tupaki Desk   |   17 Nov 2021 4:50 AM GMT
వైసీపీ వితండం.. దస్తగిరి వాంగ్మూలంపై పదే పదే సెల్ఫ్ గోల్ !
X
కీలక విషయాల్లో వాదనలు వినిపించే వేళ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అందులోనూ భావోద్వేగ అంశాల విషయంలోనూ.. సున్నితమైన ఉదంతాలపై స్పందించే వేళ వెనుకా ముందు చూసుకోవాల్సిందే. మరేం జరుగుతుందో కానీ ఏపీ అధికారపక్షమైన వైసీపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన సొంతింట్లో అత్యంత దారుణంగా చంపేసిన వైనం పెను సంచలనంగా మారింది.

ఇలాంటి ఉదంతాల్లో నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. మిగిలిన మీడియా సంస్థలతో పోలిస్తే.. ఈ వార్తకు సంబంధించిన వివరాలు.. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఫోకస్ చేయని ఎన్నో అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. విచారణ అధికారుల్ని పరుగులు తీయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. ఈ విషయాల్ని వైసీపీ నేతలు విస్మరిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. అనూహ్యంగా వైసీపీ సొంత మీడియాలో వివేకా హత్యకు కారణమైన వారికి సంబంధించి సమాచారన్ని అందించిన దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రసారం చేయటంలోనూ.. పబ్లిష్ చేయటంలోనూ అంత ప్రాధాన్యత ఇవ్వకపోవటం పలువురి నోట వినిపిస్తోంది.

ఇదే సమయంలోనే.. వైఎస్ వివేకానంద కేసుకు సంబంధించిన అంశాల్ని తమ సొంత మీడియాలో పెద్దగా కవర్ చేయకపోవటంలో ఏదైనా సాంకేతిక సమస్య ఉందనే అనుకుందాం. అదే అంశాన్ని మిగిలిన మీడియా సంస్థలు భారీ ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు వారిని అభినందించకుండా ఉన్నా ఫర్లేదు.. కానీ తిట్టిపోయటం.. కొత్త తరహా విమర్శల్ని తెర మీదకు తీసుకొచ్చి వినిపిస్తున్న వాదనలో తొండితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.

అంతేకాదు.. దస్తగిరి తన వాంగ్మూలంలో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి వివేకా హత్యలో సంబంధం ఉందన్న విషయాన్ని నేరుగా చెప్పకున్నా.. వేరే వారి ద్వారా ఆ విషయాన్ని తాను తెలుసుకున్నట్లుగా చెప్పారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వటం షురూ చేశారు. ఏదో చెబితే మరేదో రాసేస్తారా? అని పరశ్నిస్తున్నారు. మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్ని చూపించి కొన్ని మీడియా సంస్థలు అల్లరి చేస్తున్నట్లుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభివర్ణిస్తున్నారు.

ఇలాంటి వ్యాఖ్యలతో లాభం కంటే కూడా నష్టమే ఎక్కువన్న విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దోషులు ఎవరన్న విషయాన్ని కోర్టు నిర్దారిస్తుందని చెప్పే వైసీపీ నేతలు.. ఎవరి విషయంలో అయినా తీర్పే ఫైనల్ అన్న విషయాన్ని తాము మాట్లాడేటప్పుడు ఎందుకు మర్చిపోతున్నారన్నది మరో ప్రశ్న. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర లేదంటూ కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని రాచమల్లు సవాలు విసురుతున్నారు.

ఇలాంటి సవాళ్ల కారణంగా పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ అన్నది ఎక్కువ అవుతుందన్న విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు మర్చిపోతున్నారు. దేశంలోనే అత్యుత్తమ విచారణ సంస్థ కేసును విచారిస్తున్న వేళ.. ఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామాల్ని రిపోర్టు చేయటం మీడియా బాధ్యత. అందుకుసంబంధించిన అభ్యంతరాలు ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే కన్నా.. సీబీఐ అధికారులకే వినతులు ఇస్తే సరిపోతుంది కదా? అందుకు భిన్నంగా తన వాదన పేరుతో వినిపించే వితండ వాదనలా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతకు మించి మౌనమే మంచి ఆయుధం అవుతుందన్న విషయాన్ని రాచమల్లు లాంటి వాళ్లు గుర్తించకెపోవటం ఏమిటి చెప్మా?