Begin typing your search above and press return to search.

ఆ మాటే వైఎస్ అవినాష్ చెప్పి ఉంటే బాగుండేది కదా?

By:  Tupaki Desk   |   17 Nov 2021 7:30 AM GMT
ఆ మాటే వైఎస్ అవినాష్ చెప్పి ఉంటే బాగుండేది కదా?
X
దివంగత మహానేత వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద దారుణ హత్యకు సంబంధించిన అంశాలు గడిచిన మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ విచారణలో ఇచ్చిన వాంగ్మూలం కొత్త చర్చకు దారి తీసింది. ఈ వాంగ్మూలానికి సంబంధించిన వార్తలు మీడియాలో రావటం తెలిసిందే.

ఇందులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి.. చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి.. డి శంకర్ రెడ్డిలు కూడా ఉన్నట్లుగా పేర్కొనటం తెలిసిందే.

ప్రత్యక్షంగా వారి పాత్ర ఉందన్న విషయాన్ని దస్తగిరి కూడా వెల్లడించలేదు. హత్యలో పాలు పంచుకున్న వారి మధ్య జరిగిన సంభాషణల్లోనే వారి ప్రస్తావన వచ్చినట్లుగానే దస్తగిరి పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం.. వారి ప్రస్తావన రావటం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన అంశమే. అయితే.. ఎంపీ అవినాశ్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొనటమే కాదు.. ఒకవేళ అలాంటిది నిరూపిస్తే కడప జిల్లా ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేస్తామని సవాలు విసిరారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అంతేకాదు.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సంచలన వ్యాఖ్య చేశారు.

వివేకా హత్యకేసులో వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు వచ్చి మూడు రోజులు అవుతోంది. ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అందరికి సుపరిచితమైన పేర్లు ఏమైనా ఉన్నాయంటే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి.. చిన్నాన్న మనోహర్ రెడ్డిలే. ఈ ముగ్గురు ఇప్పటివరకు నోరు విప్పలేదు.

తమకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పలేదు. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా తీవ్రమైన నేరాలకు సంబంధించి ఎవరిదైనా పాత్ర ఉందన్న మాట బయటకు వచ్చినంతనే వారు తమ వాదనను వినిపిస్తారు. విషయాన్ని ఖండిస్తారు.

అందుకు భిన్నంగా ఈ ముగ్గురు మాత్రం పెదవి విప్పకుండా మౌనంగా ఉండటం.. బయటకు రాకపోవటం ఇప్పుడు చర్చగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాట్లాడకుండా.. వారి తరఫున పార్టీకి చెందిన ఇతర నేతలు మాట్లాడటం.. సవాళ్లు విసరటం.. గంభీరమైన ప్రకటనలు చేయటం కొత్త చర్చగా మారింది.

దస్తగిరి ఆరోపణల్లో నిజం ఎంతన్నది తేల్చాల్సింది సీబీఐనే. వారి విచారణలో నిజాలు వెలుగు చూడటం ఖాయం. కాకుంటే పొద్దుటూరు ఎమ్మెల్యే మాదిరి అవినాష్ రెడ్డి అండ్ కో తమ మీద పడిన మరకు తుడిచే ప్రయత్నం చేసుకుంటే బాగుండేదన్న మాట వైసీపీ శ్రేణుల నోటి వెంట తరచూ వినిపిస్తోంది.