Begin typing your search above and press return to search.

అవంతి శ్రీనివాస్ కాపు రిజర్వేషన్లు తెచ్చేసినట్లే..!

By:  Tupaki Desk   |   3 Aug 2018 7:43 AM GMT
అవంతి శ్రీనివాస్ కాపు రిజర్వేషన్లు తెచ్చేసినట్లే..!
X
టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ రోజు లోక్ సభలో రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద సమస్య కోసం ప్రయివేటు మెంబర్ బిల్లు పెడుతున్నారు. ఆయన నాలుగేళ్ల పార్లమెంటు ప్రస్థానంలో ప్రవేశపెడుతున్న తొలి ప్రయివేటు మెంబర్ బిల్లు ఇది. పార్లమెంటులో ఎన్నడూ కాపుల రిజర్వేషన్ గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని అవంతి ఇప్పుడు ఏకంగా కాపుల రిజర్వేషన్ల కోసం ప్రయివేటు మెంబరు బిల్లు పెడుతున్నారు.

ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ఆమోదముద్ర వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని అవంతి డిమాండ్ చేస్తున్నారు. కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీలో వేడిని పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ చెబుతున్నా చేస్తున్నదేమీ లేదని ఉద్యమకారులు అంటున్నారు.

మరోవైపు ప్రయివేటు మెంబర్ బిల్లు అనేది కేవలం కంటి తుడుపు చర్చ అని ఇతర పార్టీల ఎంపీల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుత లోక్ సభలో 870కి పైగా ప్రయివేటు మెంబర్ బిల్లులు పెడితే అందులో ఒక్కటైనా చట్టరూపం దాల్చిందా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా - రైల్వే జోన్ వంటి అంశాల్లో కేవీపీ రామచంద్రరావు - రామ్మోహన్ నాయుడు వంటివారు పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లులకే అతీగతీ లేదని అంటున్నారు. ఇప్పుడు అవంతి ప్రవేశపెట్టే బిల్లుతో కాపు రిజర్వేషన్లు వచ్చేసినంతగా టీడీపీ వారు హడావుడి చేస్తున్నారంటూ విమర్శలు కురిపిస్తున్నారు.