Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ పోరాటం డ్రామా అని తెలిసిపోయిందా?

By:  Tupaki Desk   |   6 May 2018 10:38 AM GMT
టీడీపీ ఎంపీ పోరాటం డ్రామా అని తెలిసిపోయిందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని తేల్చిచెప్ప‌డం అనంత‌రం బీజేపీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీ త‌న‌దారి తాను చూసుకోవ‌డం తెలిసిన సంగ‌తే. దీంతో హోదా కోసం పోరాటం చేస్తున్నామ‌ని ఓ వైపు టీడీపీ నేత‌లు చెప్తున్న‌ప్ప‌టికీ..మ‌రోవైపు ఆ పార్టీ నేత‌ల తీరుపై క్యాడ‌ర్‌ లోనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాలుగేళ్ల పాటు స్త‌బ్ధుగా ఉండి ఇప్పుడు పోరాటం అంటే న‌మ్మేదెవ‌ర‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌మ ఉనికి కోసం, స‌మ‌స్య ప‌రిష్కారం కోసం మేమూ పోరాటం చేశామ‌నే భావ‌న‌ను వ్య‌క్తీక‌రించేందుకు గ‌ళం ఎత్తుతూనే ఉన్నారు. తాజాగా అధికార పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ విశాఖ రైల్వే జోన్‌ కావాలని దీక్షకు దిగడం ఇందులో భాగ‌మ‌నే అంటున్నారు.

విశాఖ‌కు రైల్వే జోన్ సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇన్నాళ్లు టీడీపీ నేత‌లు మౌనం దాల్చిన‌ప్ప‌టికీ తాజాగా దీనిపై స్పందిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ విశాఖ రైల్వే జోన్‌ కావాలని దీక్షకు దిగారు. ఆయన ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్‌ లో రైల్వే జోన్‌ కోసం దీక్ష కు కుర్చున్నారు. ఆయన తో పాటు, ప్రత్యేక హోదా ఉద్యమ కారులు, నాయకులు కూడా దీక్షలో కుర్చున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..విశాఖ కు రైల్వే జోన్‌ వల్ల దేశానికే మంచి ఉపయోగమని, రాజకీయాలు మాని వెంటనే విశాఖ లో రైల్వే జోన్‌ ఏర్పాటు పై ఒక నిర్ధిష్ట ప్రకటన విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అయితే అవంతి ఆందోళ‌న‌పై ప్ర‌జ‌లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ స‌హా విశాఖ వాసులు, ఏపీకి చెందిన ప‌లు సంఘాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు విశాఖకు రైల్వే జోన్ కావాలని నిర‌స‌న తెలిపార‌ని గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం కోసం అన్ని వర్గాలు ఒకటై రైల్వే జోన్‌ కోసం ఉద్యమం చేస్తున్న స‌మ‌యంలో అప్పుడు ఇదిగో అదుగో అంటూ మాట‌లు చెప్పార‌ని..ఇప్పుడు ఓట్ల సీజ‌న్ రావ‌డంతో నిర‌స‌న చేస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.