Begin typing your search above and press return to search.

నంద్యాల టీడీపీలో సుబ్బారెడ్డి రేపిన గబ్బు

By:  Tupaki Desk   |   12 July 2017 5:36 AM GMT
నంద్యాల టీడీపీలో సుబ్బారెడ్డి రేపిన గబ్బు
X
అసలే కష్టకాలం నడుస్తోంది. ఏ ఇద్దరు నేతల మధ్యా సమన్వయం లేక ఎన్నికల దారి అగమ్యగోచరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల టీడీపీ నేతలు తమ వివాదాస్పద వైఖరితో పార్టీకి మరింత చేటు చేస్తున్నారు. తాజాగా అక్కడి టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించి బయటపడిన ఒక ఆడియో టేపు ఇప్పుడు టీడీపీని మరింత ఇబ్బంది పెడుతోంది.

ఓ వ్యక్తిపై టీడీపీ నేతల దాడికి సంబంధించిన వీడియోను స్థానిక ముస్లిం నేత ఒకరు వాట్సాప్‌ లో పోస్టు చేశారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డి నేరుగా ముస్లిం నేతకు ఫోన్‌ చేసి నానా బూతులు తిట్టారు. వార్నింగులు కూడా ఇచ్చారు. ఆ సమయంలో ఆయన నోటికొచ్చిన బూతులు తిట్టారు. అన్నా…. తిట్టవద్దు అని ముస్లిం నేత వేడుకున్నా సుబ్బారెడ్డి మాత్రం వెనక్కు తగ్గలేదు. నీవు ఎక్కడ ఉన్నావో చెప్పు రా నేనే వచ్చి నీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ ఆడియో టేపు బయటకు రావడంతో టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. అసలే విజయావకాశాలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. అంతలో... మైనారిటీ నేతపై ఈ స్థాయిలో విరుచుకుపడిన విషయం సోషల్ మీడియాలో బయటకొచ్చేయడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ నేతలు గిలగిలలాడుతున్నారు. ముస్లింలను బుజ్జగించేందుకు మాజీ మంత్రి ఫరూక్ వంటివారికి పదవులు ఎరవేస్తూ మంత్రులు - ముఖ్యమంత్రి కసరత్తులు చేస్తుంటే భూమా కుటుంబానికి ఆత్మ లాంటి ఏవీ సుబ్బారెడ్డి ఇలా ముస్లింలను దూషించడంతో దుమారం రేగింది. వెంటనే ఏవీ సుబ్బారెడ్డి క్షమాపణ చెప్పాలని మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామం అటుతిరిగి ఇటు తిరిగి చివరకు భూమా బ్రహ్మానందరెడ్డి కిందకు నీళ్లు తెచ్చేలా ఉందని భూమా కుటుంబం ఆందోళన చెందుతోంది.