Begin typing your search above and press return to search.

గుర్తిస్తేనే పార్టీలో ఉంటాడట ఈ తమ్ముడు

By:  Tupaki Desk   |   10 Dec 2020 12:30 PM GMT
గుర్తిస్తేనే పార్టీలో ఉంటాడట ఈ తమ్ముడు
X
తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇస్తేనే తెలుగుదేశంపార్టీలో యాక్టివ్ గా ఉంటానంటు నంద్యాలకు చెందిన సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి పెద్ద బాంబే పేల్చారు. దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి ఉన్నపుడు జిల్లాలో ఏవి చెలాయించిన అధికారాలు ఏమిటో అందరికీ తెలిసిందే. భూమా తరపున మొత్తం వ్యవహారాలన్నింటినీ ఏవీయే చక్కబెట్టేవారు. అలాంటిది ఎంఎల్ఏ మరణంతో కష్టాల్లో పడిపోయారు. దివంగత ఎంఎల్ఏని అన్నీ తానే అయి నడిపించిన ఏవీ తర్వాత ఆయన కూతురు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో మాత్రం పడలేదు.

అఖిల మంత్రి అయిన దగ్గర నుండి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్నాయి. ఈ పరిస్దితుల్లో మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో పాటు అఖిల కూడా ఘోరంగా ఓడిపోయారు. ఆళ్ళగడ్డలో ఉండే ఈ నేత నంద్యాలలో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి అఖిలతో పాటు ఏవీ కూడా కామ్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఈ నేత పెద్దగా కనబడటం లేదు. అలాంటిది నంద్యాలలో ఓ షాపు ఓపెనింగ్ కు వచ్చిన ఏవి మీడియాతో మాట్లాడుతూ తనకు పార్టీ గుర్తింపు ఇస్తేనే యాక్టివ్ గా ఉంటానంటూ అల్టిమేటమ్ జారీ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

పార్టీలో ఏవికన్నా ఎంతో సీనియర్లయిన కేఇ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, ఎన్ఎండి ఫరూక్ లాంటి వాళ్ళు ఎంతోమంది కామ్ గా ఉండిపోయారు. నంద్యాలలో ఉన్నదంతా తన వర్గమే అన్నారు. నంద్యాలలో భూమా వర్గం వేరు తన వర్గం వేరు కాదని ఏవి చెప్పటం కాస్త విచిత్రంగానే ఉంది. తన వర్గం వాళ్ళకు పదవులు ఇస్తే పార్టీకే మంచిదన్నారు. ఈమధ్యనే నియమించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి ఏవి మాటల్లో కనిపించింది. మరి ఏవీలోని అసంతృప్తిని చంద్రబాబునాయుడు పట్టించుకుంటారా ?