Begin typing your search above and press return to search.

ఏడు ల‌క్ష‌ల ఐటీ ఉద్యోగుల‌పై వేటు!

By:  Tupaki Desk   |   7 Sep 2017 6:05 AM GMT
ఏడు ల‌క్ష‌ల ఐటీ ఉద్యోగుల‌పై వేటు!
X
ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా దుర్వార్త‌ల‌కు వేదిక‌గా మారిన ఐటీ రంగంపై మ‌రో షాకింగ్ జోస్యం వెలువ‌డింది. లే ఆఫ్ కార‌ణంగా బిక్క‌చ‌చ్చిపోతున్న ఐటీ ఉద్యోగుల‌పై మ‌రో కొత్త క‌త్తి వేలాడుతోంద‌ని విశ్లేషించింది. వచ్చే ఐదేళ్ల‌లో ఐటీ రంగంలో ఆటోమేషన్‌ వల్ల లక్షలాది మంది ఉపాధికి ఎసరు పడనుందని తాజా నివేదిక ఒక‌టి విశ్లేషించింది. ప్రతి మూడింటిలో ఒక్క ఉద్యోగం ఊడనుందని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న హెచ్‌ ఎఫ్‌ ఎస్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. దీనికంత‌టికీ కార‌ణం ఆటోమేష‌న్ అని జోస్యం చెప్పింది.

ఆటోమేషన్‌ దెబ్బతో ఐటీలో వచ్చే 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల ఉద్యోగాలు పోతాయని హెచ్చరించింది. ఇందులో మధ్యస్థ - అత్యధిక నైపుణ్యం కలిగిన వాటిలో కూడా లక్ష నుంచి 1.9 లక్షల ఉద్యోగాలు పోవచ్చని పేర్కొంది. ముఖ్యంగా అమెరికా - బ్రిటన్‌ - భారత్‌ లాంటి దేశాల్లో నికర ఉద్యోగుల సంఖ్య 7.5 శాతం మేర పడిపోవచ్చని హెచ్‌ ఎఫ్‌ ఎస్‌ అంచనా వేసింది. రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌ పీఏ) - కృత్రిమ మేథస్సు (ఏఐ) వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో ఆటోమేషన్‌ లో అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో 57 శాతం పెరుగుదల ఉండొచ్చని పేర్కొంది. కాగా 2021 నాటికి తక్కువ నైపుణ్యం కలిగిన 6.4 లక్షల ఉద్యోగాలు పోతాయని ఇది వరకు ఇదే సంస్థ అంచనా వేసింది. ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మంది పునర్‌ నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా భవిష్యత్తు కోసం సంబంధిత కంపెనీలు తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా వాటిపై ఉందని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులతో ఐదేళ్ల‌ పాటు సర్దుపోవచ్చని, కాని ఆ తర్వాత చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.