Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కుటుంబాన్ని వ‌ద‌ల‌ని ఆగ‌స్టు.. విషాదాలెన్నో!

By:  Tupaki Desk   |   2 Aug 2022 5:15 AM GMT
ఎన్టీఆర్ కుటుంబాన్ని వ‌ద‌ల‌ని ఆగ‌స్టు.. విషాదాలెన్నో!
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆగ‌స్టు గండం వ‌ద‌ల‌డం లేదు. ఆగ‌స్టు నెల వ‌స్తుందంటే ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు లేదా టీడీపీ భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉందంటే ఆ నెల ఎన్టీఆర్ జీవితంలో ఎంత విషాదానికి కార‌ణ‌మైందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఆగ‌స్టు నెలలోనే ఆ పార్టీలోనూ, ఎన్టీఆర్ కుటుంబంలోనూ ప‌లు విషాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఎన్టీఆర్ చిన్న‌కుమార్తె కంఠ‌మ‌నేని ఉమామ‌హేశ్వ‌రి ఆగ‌స్టు 1నే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అలాగే ఎన్టీఆర్ నాలుగో కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ నెల్లూరులో పెళ్లికి హాజ‌ర‌వుతూ 2019 ఆగ‌స్టు 29న న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన‌ రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

ఇక టీడీపీకి కూడా ఆగ‌స్టు నెల అచ్చిరాలేదు. 1984 ఆగ‌స్టులో ఎన్టీఆర్ హార్ట్ స‌ర్జ‌రీ కోసం అమెరికా వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న‌ నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. అయితే తిరిగి నెల రోజుల‌కే ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు.

మ‌ళ్లీ 1995 ఆగ‌స్టులో చంద్ర‌బాబు రూపంలో టీడీపీలో సంక్షోభం ఏర్ప‌డింది. ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేసి చంద్ర‌బాబు అధికారంలోకి వచ్చారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా తానే అధిప‌తిన‌ని దాన్ని త‌న చేతుల్లోకి తీసుకున్నారు. ఇలా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని, పార్టీని ఎన్టీఆర్ కు కాకుండా చేశారు. ఆ మ‌నోవ్య‌థ‌తోనే కొద్ది నెల‌ల‌కే 1996 జ‌న‌వ‌రిలో ఎన్టీఆర్ క‌న్నుమూశార‌ని అంటుంటారు.

ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ చిన్న‌కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి ఆగ‌స్టులోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి త‌మ కుటుంబానికి ఆగ‌స్టు అచ్చిరాద‌నే విష‌యాన్ని నిరూపించారు.