Begin typing your search above and press return to search.

షాకింగ్ న్యూస్‌: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ పై చెప్పు దాడి!

By:  Tupaki Desk   |   11 Jun 2022 3:13 AM GMT
షాకింగ్ న్యూస్‌: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ పై చెప్పు దాడి!
X
మొన్నీమధ్యే.. తెలంగాణ‌ మంత్రి మల్లారెడ్డిపై... రెడ్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా.. చెప్పులు, రాళ్లు, బాటిళ్లు, చైర్లు.. ఇలా ఏది పడితే అది విసురుతూ.. తమ కోపాన్ని ప్రదర్శించారు. ఈ దాడి ఇప్పుడిప్పుడే మరుగున పడుతున్న వేళ.. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్పైన! నిజంగానే జరిగిందా..? అలా ఎందుకు జరిగింది...? అసలు కేటీఆర్పై అంత కోపం ఎవరికుంది..? అనే ప్రశ్నలు తెలుసుకోవాలంటే.. జగిత్యాల జిల్లా మెట్పల్లికి వెళ్లాల్సిందే.

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. శుక్ర‌వారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. కాగా.. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవాలంటూ చెరకు రైతులు ఈ మధ్య కాలంలో ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఏడేళ్లయినా.. ఇప్పటికీ ఫ్యాక్టరీ తెరవకపోవటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సందర్భంలో మంత్రి కేటీఆర్.. జగిత్యాలలో పర్యటిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమ య్యారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకోవటంతో పాటు.. రైతులు చేస్తున్న ఆందోళనల ప్రభావం పర్యటనపై పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. జిల్లావ్యాప్తంగా రైతుసంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధు లను పోలీసులు ముందస్తు అరెస్ట్లు కూడా చేశారు. అదే క్రమంలో.. చెరకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డితో పాటు పలువురు రైతులను కూడా అదుపులోకి తీసుకుని మెట్పల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. ఏ తప్పు చేయకున్నా ఇలా అకారణంగా అరెస్ట్లు చేయడం అన్యాయమని ఠాణా ప్రాంగణంలో నిలబడి పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో మెట్పల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తున్నారు. స్టేషన్ ముందు నుంచి కేటీఆర్ వెళ్తుండటం గమనించిన నారాయణరెడ్డి.. పరిగెత్తుకుంటూ వెళ్లి మంత్రి కాన్వాయ్పై చెప్పు విసిరారు. అప్పటి వరకు కాన్వాయ్పై దృష్టి పెట్టిన పోలీసులు.. వెనక నుంచి నారాయణరెడ్డి పరుగెత్తుకుంటూ రావటాన్ని గమనించలేకపోయారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అతడ్ని అడ్డుకుని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో తీవ్ర సంచ‌ల‌నం రేపింది. మ‌రి దీనిపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.