Begin typing your search above and press return to search.

జోష్ లేని ఆత్మ‌కూరు బైపోల్‌!

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:38 AM GMT
జోష్ లేని ఆత్మ‌కూరు బైపోల్‌!
X
నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక నిరాశా నిస్పృహ‌ల‌తో సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కే పోలింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. ఓటర్లు పెద్ద‌గా కేంద్రాల‌కు త‌ర‌లి రావ‌డం లేదు. నిజానికి ఉద‌యం 7-10 మధ్య సాధార‌ణ పోలింగ్ స‌మ‌యంలోనే ఇక్క‌డ 25 శాతం పోలింగ్ జ‌రిగింది. అలాంటిది..

ఇప్పుడు మాజీ మంత్రి గౌతంరెడ్డి మ‌ర‌ణానంత‌రం జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో అంత‌కుమించిన జోష్ క‌నిపించాలి. ఉద‌యాన్ని కేంద్రాల‌కు త‌ర‌లి రావాలి. కానీ, ఆ జోష్ క‌నిపించ‌డం లేదు.

ఆత్మకూరు శాసనసభ పరిధిలో ఆరు మండలాలు సంగ, మర్రిపాడు, ఆత్మకూరు, అనంతసాగరం చేజర్ల, ఏఎస్ పేట, పరిధిలో నేటి ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ పక్రియ ప్రారంభ‌మైంది. దీనికి సంబం ధించి..

బుధ‌వారం రాత్రి వ‌ర‌కు కూడా ఓట‌ర్ల‌ను అధికార పార్టీ నేత‌లు క‌లిశార‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నేత‌లు విమ‌ర్శించారు. అదేస‌మ‌యంలో ఓట‌ర్ల‌కు బ‌హుమ‌తులు కూడా ఇచ్చార‌ని వీరు ఆరోపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పోలింగ్ ఊపందుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మొత్తం 279 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఓటింగ్ పక్రియ కొనసాగుతోంది.వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ చక్రదర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 13,400. అయితే.. ఈ రోజుఉద‌యం 11 గంట‌ల‌కు కేవ‌లం 11.2 శాత‌మే ఓటింగ్ జ‌ర‌గ‌డంగ‌మ‌నార్హం. మ‌రోవైపు.. వ‌లంటీర్లు.. ఓట‌ర్ల ఇంటికి వెళ్లి మ‌రీ... బ్ర‌తిమాలుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

స‌ర్కారుపై కోపంతోనే!

సాధార‌ణంగా.. ఎమ్మెల్యే మ‌ర‌ణించిన సంద‌ర్భాల్లో జ‌రిగే ఇలాంటి పోలింగ్ జోష్‌తో ఉంటుంది. కానీ, ఈ ద‌ఫా ప్ర‌బుత్వంపైన లేదా.. స్థానిక నేత‌ల‌పైనా ఉన్న ఆగ్ర‌హం క‌నిపిస్తోంద‌ని.. అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా సాగుతున్న వైసీపీ ప్ర‌భంజ‌నానికి అంతో ఇంతో బ్రేకులు వేయాల‌ని.. ఓట‌ర్లు భావిస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా.. వైసీపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేయాల‌ని అనుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.