Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్ కి అసలేమైంది?

By:  Tupaki Desk   |   12 Jun 2018 5:37 AM GMT
వాజ్ పేయ్ కి అసలేమైంది?
X
మాజీ ప్ర‌ధాన‌మంత్రిగా.. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేసిన రాజ‌కీయ నేత‌గా దేశ ప్ర‌జ‌లంద‌రి మదిలో పార్టీల‌కు అతీతంగా అభిమానించే అతి కొద్దిమంది నేత‌ల్లో అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ ఒక‌రు. మ‌త‌త‌త్త్వ పార్టీగా ముద్ర ప‌డిన బీజేపీకి స‌రికొత్త రంగు.. రూపును ఇవ్వ‌టంలో వాజ్ పేయ్ విజ‌యం సాధించార‌ని చెప్పాలి. కొన్నేళ్లుగా బ‌య‌ట ప్ర‌పంచానికి దూరంగా త‌న‌దైన లోకంలో ఉంటున్న వాజ్ పేయ్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు.

ఆయ‌న ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్నార‌ని.. ఆయ‌న కొంత‌కాలంగా ఎవ‌రిని గుర్తించ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అనారోగ్యం కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన‌ట్లుగా చెప్పే బీజేపీ నేత‌లు..చివ‌ర‌కు వాజ్ పేయ్ కి భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసిన వేళ‌లోనూ ఆయ‌న ఫోటో బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

వాజ్ పేయ్ ని అభిమానించే వారు ఆయ‌న ఇప్ప‌టి రూపాన్ని చూసి జీర్ణించుకోలేర‌ని.. అందుకే ఫోటోలు బ‌య‌ట‌కు రానివ్వ‌టం లేద‌న్న మాట‌ను ప‌లువురు బీజేపీ నేత‌లు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వాజ్ పేయ్ కు సంబంధించి సోమ‌వారం నాట‌కీ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆయ‌న‌కు రోటీన్ చెక‌ప్ లో భాగంగా ఎయిమ్స్ కు త‌ర‌లించిన‌ట్లుగా వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొద‌ట దీన్ని మామూలుగా అంశంగానే భావించారు. అయితే.. గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో ఒక్క‌సారి ఉలిక్కిప‌డిన ప‌రిస్థితి.

కొన్నేళ్లుగా శ్వాస‌కోస సంబంధ వ్యాధితోనూ.. మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తోనూ బాధ ప‌డుతున్న వాజ్ పేయ్ ఆరోగ్య ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌న్న మాట సోమ‌వారం రాత్రికి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న ఊపిరితిత్తుల్లో ఒక‌టి స‌రిగా ప‌ని చేయ‌టం లేద‌ని.. మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ను కూడా ఆయ‌న ఎదుర్కొంటున్నార‌ని.. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు డ‌యాల‌సిస్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

రోటీన్ చెక‌ప్ కోసం వాజ్ పేయ్ ను ఎయిమ్స్ కు త‌ర‌లించ‌టం నిజ‌మే అయితే.. ఈ చిన్న విష‌యానికే దేశ ప్ర‌ధాని మోడీ గంట‌కు పైనే ఎయిమ్స్ లో గ‌డ‌ప‌టం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. పార్టీకి వెన్నుముక లాంటి పెద్దాయ‌న ఆరోగ్యం బాగోలేదు కాబ‌ట్టి అంత‌సేపు మోడీ ఉన్నార‌ని స‌ర్ది చెప్పుకున్నా.. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సైతం ఆసుప‌త్రికి రావ‌టం చూస్తే.. వాజ్ పేయ్ ఆరోగ్యం మీద బీజేపీ ముఖ్య‌నేత‌లు చెబుతున్న మాట‌ల‌కు.. వాస్త‌వానికి మ‌ధ్య ఇంకేదో ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

రోటీన్ చెక‌ప్ కోసం వెళ్ల‌ట‌మే నిజ‌మైతే.. బీజేపీ ముఖ్య‌నేత‌లు మోడీ.. అమిత్ సా?. అద్వానీ.. కేంద్ర‌మంత్రులు సుష్మా స్వ‌రాజ్‌.. జేపీ న‌డ్డాతో స‌హా అనేక మంది నేత‌లు వెళ్లి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవ‌టం చూస్తుంటే.. వాజ్ పేయ్ ఆరోగ్యం ఎంత క్రిటిక‌ల్ గా ఉంద‌న్న‌ది అర్థం చేసుకోవ‌చ్చ‌న్న మాట బీజేపీకి చెందిన ఒక ముఖ్య‌నేత ఆఫ్ ద రికార్డుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం.