Begin typing your search above and press return to search.

అప్పటి మాదిరి ఇప్పుడూ కుండబద్ధలు కొట్టగలరా అశోక్ గజపతి రాజు?

By:  Tupaki Desk   |   3 May 2022 3:20 AM GMT
అప్పటి మాదిరి ఇప్పుడూ కుండబద్ధలు కొట్టగలరా అశోక్ గజపతి రాజు?
X
మిగిలిన రంగాలకు చాలా భిన్నమైనది రాజకీయ రంగం. పేరుకు ప్రజలకు సేవ చేయటానికి రాజకీయ పార్టీ అని చెబుతారు కానీ.. వాస్తవంలో జరిగేదేమిటో అందరికి తెలిసిందే. కొందరికి కొన్ని పార్టీలు నచ్చవు. కానీ.. ఆ పార్టీకి చెందిన నేతల్ని మాత్రం ఎక్కువగా అభిమానిస్తుంటారు.

వైసీపీకి చెందిన దివంగత నేత మేకపాటి గౌతం రెడ్డిని.. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. అదే విధంగా టీడీపీ సీనియర్ నేత.. కేంద్రమంత్రిగా వ్యవహరించి మధ్యలో రాజీనామా చేసిన అశోక్ గజపతి కూడా ఆ కోవలోకే వస్తారు.

తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. కేంద్ర మంత్రిగా ఉండి కూడా తన పదవికి రాజీనామా ఎందుకు చేశారు? అని అడిగితే.. సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తూ.. ‘‘రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకపోవటం వల్లే రాజీనామా చేశా.

అందుకే పదవి నుంచి బయటకు వచ్చేశా’’ అని చెప్పటం తెలిసిందే. అలా ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం ఆయనకు అలవాటు. ఇప్పటికి కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తుందని చెప్పటం గమనార్హం.

అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడు తాను ఒకేలా ఉన్నట్లుగా పేర్కొన్న అశోక్ గజపతి.. రాష్ట్రానికి ఇంత అన్యాయం ఇప్పటికి జరుగుతున్నప్పుడు అశోక్ గజపతి రాజు ఎందుకు మాట్లాడం లేదు? అన్నది కూడా ప్రశ్నే. ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి అర్థమైన తర్వాత.. దాని గురించి అప్పట్లో మాట్లాడలేదు సరే.. ఇప్పుడు ఎందుకుమాట్లాడటం లేదు? అన్నది మరో ప్రశ్న.

అప్పట్లో రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయటం లేదని.. చేతిలో ఉన్న అధికారాన్ని అప్పజెప్పేసి వచ్చినట్లుగా చెప్పుకునే అశోక్ గజపతి.. ఏపీకి ఇప్పుడు జరుగుతున్న నష్టాల మీద గొంతు విప్పి ఎందుకు మాట్లాడరు? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఇలాంటి వాటికి అశోక్ గజపతి లాంటి వారు సమాధానం చెబితే బాగుంటుందని చెప్పకతప్పదు.