Begin typing your search above and press return to search.

అశోక్ నెట్టుకురాగలరా ?

By:  Tupaki Desk   |   18 Jun 2021 6:30 AM GMT
అశోక్ నెట్టుకురాగలరా ?
X
ప్రభుత్వ సహకారం లేకుండా ఎవరు కూడా ఏ పదవిలోను హ్యాపీగా ఉండలేరు. అందులోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్ళి సీట్లొ కూర్చున్న వాళ్ళ పరిస్దితి మరింత అన్యాయంగా తయారవుతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇపుడిదంతా ఎందుకంటే మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అశోక్ గజపతిరాజు గురించే. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ హోదాలో ట్రస్ట్ పరిధిలోని 104 దేవాలయాల బోర్డులకు అనువంశిక ఛైర్మన్ గా అశోక్ బాధ్యతలు తీసుకున్నట్లయ్యింది.

ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకోగానే ఇటు మాన్సాస్ ట్రస్ట్ ఆఫీసులోను అటు సింహాచలం దేవస్ధానం ఆలయంలోను తనకు అధికారులు సహకరించటం లేదని అశోక్ గోల మొదలుపెట్టేశారు. సింహాచలం ఆలయానికి వెళ్ళినపుడు తనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకలేదని, ఉన్నతాధికారులు ఎవరు హాజరుకాలేదంటు రాజుగారు ఆరోపించిన విషయం తెలిసిందే.

ట్రస్ట్ అధికారులతో సమావేశమైన తర్వాత ట్రస్టు ఆదాయ, వ్యాయాలకు సంబంధించి గడచిన పదేళ్ళుగా ఎందుకు ఆడిట్ చేయించలేదో తనకు తెలీదని చాలా అమాయకంగా ప్రశ్నించారు. గడచిన పదేళ్ళు ట్రస్టు లెక్కలకు ఆడిట్ జరగలేదంటే అందుకు తాను కూడా కారణమని మరచిపోయినట్లున్నారు. ఎందుకంటే ఏడాది కాలం సంచైత గజపతిరాజు ఛైర్ పర్సన్ గా ఉంటే అంతకుముందు తొమ్మిదేళ్ళు అశోకే ఛైర్మన్ గా ఉన్నారు. మరెందుకు ఆడిట్ చేయించలేదో ఆయనే సమాధానం చెప్పాలి.

ఇక సింహాచలం దేవస్ధానం గురించి మాట్లాడుతు తొందరలోనే ఉన్నతాధికారులతో సమావేశమవుతానని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అశోక్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా అధికారుల నుండి సహకారం అందేది అనుమానమే. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డిపై రాజుగారు ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేస్తునే ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని తిడుతునే మళ్ళీ ప్రభుత్వాధికారులు తనకు సహకరించటం లేదని ఆరోపించటంలో అర్ధంలేదు.

ప్రభుత్వాన్ని కాదని అశోక్ ఏమీ చేయలేరన్నది వాస్తవం. అలాగే అశోక్ ఉన్నంతవరకు ట్రస్టు, దేవాలయం విషయంలో ప్రభుత్వం కూడా తాను అనుకున్నది అనుకున్నట్లు చేసేందుకు సాధ్యంకాదు. ఇటు ప్రభుత్వమైనా అటు అశోక్ అయినా ఎవరో ఒకరు తగ్గేంతవరకు ఈ గోల ఇలా నడుస్తునే ఉంటుంది. ట్రస్టు బోర్డులో సభ్యుల వైఖరిపైనే అశోక్ వ్యవహారం ఆధారపడుంటుందని అర్ధమైపోతోంది. చూద్దాం మొదటి మీటింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో రాజుగారు.