Begin typing your search above and press return to search.

అసద్ పొలిటికల్ గేమ్ ప్లాన్ ను బయటపెట్టిన తికాయత్

By:  Tupaki Desk   |   26 Nov 2021 4:02 AM GMT
అసద్ పొలిటికల్ గేమ్ ప్లాన్ ను బయటపెట్టిన తికాయత్
X
ఇప్పటివరకు తరచూ రాజకీయ ఆరోపణలు ఎదుర్కొనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మీద తరచూ ఘాటు విమర్శలు చేస్తూ.. మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసే అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీ కోసం ఏ రీతిలో పని చేస్తారో తెలుసా? అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రయోజనాల్ని కాపాడేందుకు వీలుగా అసద్.. మత విభజన వ్యూహాలతో కమలనాథులకు సాయం చేస్తారన్నారు. బీజేపీ ఎక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంటే అక్కడ మజ్లిస్ అధినేత ఓవైసీ ఎంట్రీ ఇస్తారన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రయోజనాల్ని కాపాడటమే ఓవైసీ లక్ష్యమన్నారు. ఈ విషయాల్ని చెప్పే క్రమంలో అసదుద్దీన్ ఓవైసీపై ఘాటు వ్యాఖ్యలు చేసేందుకు సైతం వెనుకాడలేదు.

అసదుద్దీన్ ఓవైసీ దున్నపోతుగా అభివర్ణిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రయోజనాల్ని కాపాడేందుకు ఒక దున్నపోతు తిరుగుతున్నది. దాన్ని హైదరాబాద్ లోనే బంధించాలి. మత విభజన వ్యూహాలతో బీజేపీకి అసద్ సాయం చేస్తారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఇదే విషయాన్ని వెల్లడించినట్లుగా చెప్పారు.

అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే అంశాన్ని తాము చెబుతున్నామన్నారు. తాము చేస్తున్న ప్రచారం ఫలితాన్ని ఇస్తుండటంతోనే మూడు వ్యవసాయ చట్టాల్ని మోడీ సర్కారు వెనక్కి తీసుకుందన్నారు. చట్టాల్ని రద్దు చేస్తున్న విషయాన్ని ఏకపక్షంగా ప్రకటించారని గుర్తు చేసిన ఆయన.. రైతు ప్రతినిధులతో చర్చలు జరపటం నేరమా? అని సూటిగా ప్రశ్నించారు.

మొత్తంగా.. అసద్ మీద ఇప్పటివరకు గాలి వాటంగా వినిపించే విమర్శలు.. ఆరోపణలకు బలం చేకూరేలా తికాయత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. మరి.. ఈ వ్యాఖ్యలపై అసద్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.