Begin typing your search above and press return to search.

బీజేపీతో పొత్తు : అసద్ మార్కు కౌంట‌ర్

By:  Tupaki Desk   |   21 Sep 2015 5:37 AM GMT
బీజేపీతో పొత్తు : అసద్ మార్కు కౌంట‌ర్
X
బీజేపీతో ఎంఐఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందంటూ వస్తున్న వార్తలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు కేంద్రంగా ప్రారంభ‌మైన ఈ చ‌ర్చ‌ రాజ‌కీయ దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై అన్ని పార్టీలు స్పందించినా ఎంఐఎం పార్టీ అగ్ర‌నేతలు మాత్రం స్పందించ‌లేదు. దీంతో లోపాయికారి ఒప్పందం ఏదో ఉంద‌నే అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే ఈ చ‌ర్చ‌పై ఎట్ట‌కేల‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నోరువిప్పారు. బీజేపీతో పొత్తు పూర్తిగా అబద్ధం అని అన్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌న్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఓవైసీ చెప్పారు. అయితే తమ పోటీ సీమాంచల్ ప్రాంతానికే పరిమితం అవుతుంద‌ని స్పష్టం చేశారు. ఎన్ని స్థానాలలో పోటీ చేయాలన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ సంద‌ర్భంగా అసద్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ - బీజేపీకి ఏర్పాటైన జ‌న‌తా ప‌రివార్ కూట‌మిని తేలిక‌గా తీసిపారేశారు. బీహార్ ఎన్నికలలో జనతా పరివార్ కూటమి ఎటువంటి ప్రభావం చూపదని అస‌ద్ అన్నారు.