Begin typing your search above and press return to search.

చైనాతో ఉద్రిక్తత: మోడీవల్లేనని అసదుద్దీన్ ఆగ్రహం

By:  Tupaki Desk   |   19 Jun 2020 5:30 PM GMT
చైనాతో ఉద్రిక్తత: మోడీవల్లేనని అసదుద్దీన్ ఆగ్రహం
X
చైనా సరిహద్దులో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాని నరేంద్రమోడీ కారణమని, దీంతో మన దేశం 20 మంది జవాన్లను కోల్పోయిందని మజ్లిస్ పార్టీ అధినేత అసరుద్దీన్ ఓవైసీ శుక్రవారం ఆరోపించారు. కాంగ్రెస్ వంటి పార్టీ కూడా చైనా కొద్దిరోజులుగా అక్కడే ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. అఖిలపక్ష సమావేశానికి అసదుద్దీన్‌ను ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ పరిస్థితికి మీ నేతృత్వంలోని రాజకీయ, వ్యూహాత్మక వైఖరే కారణమన్నారు. చైనాతో డీల్ చేయడంలో మీరు విఫలమయ్యారని, ఇది దురదృష్టకరమన్నారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగం వృధాగా పోరాదన్నారు. గాల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమించుకున్న భారత భూబాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పొందడమే ఆ సైనికుల త్యాగానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుందన్నారు. చైనా చొరబాట్లు, భారతీయ నిర్ణయాధికారంలో లోపాలు, చైనా ఆక్రమణలో భారత్ భూభూగం కోల్పోయిన అంశాలను ఈ దేశంతో పంచుకోవాలని డిమాండ్ చేశారు.

జవాన్ల మరణం, భారత్ భూభాగం కోల్పోవడానికి దారితీసిన కారణాలపై స్వతంత్ర సమీక్ష కమిటీని వేయాలని సూచించారు. ప్రభుత్వం ఆ కమిటీ ఇచ్చిన ఫలితాలపై శ్వేతపత్రం ప్రచురించాలని, ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 2014 మే నుంచి భారత్ భూభూగాన్ని చైనా ఎంత ఆక్రమించింది, ఎంతమంది జవాన్లు అమరులయ్యారు, చైనాతో ఎన్నిసార్లు చర్చలు జరిగాయి వంటి అంశాలపై సమాధానం చెప్పాలని 11 ప్రశ్నలు కేంద్రానికి స్పందించారు. ఇటీవల 20 మంది సైనికులు అమరులు కావడానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడం వంటి వాటికి సమాధానం చెప్పాలన్నారు.

ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుండి ప్రతిపక్ష పార్టీలు సమాధానం కోరేందుకు పార్లమెంటును సమావేశపరచాలని డిమాండ్ చేశారు. భారత భూభాగం ఆక్రమణకు సంబంధించి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు. తమను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై అసదుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్లమెంటులో కనీసం 5గురు ఎంపీలు ఉన్న సభ్యులనే ఆహ్వానించడం సరికాదన్నారు. ఇలాంటి సమయంలో అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలన్నారు. తమది చిన్న పార్టీ అయినప్పటికీ చైనా అంశంపై గత కొద్ది రోజులుగా తాను లేవెనత్తుతున్నాన్నారు. ఓ సరిహద్దు దేశం మన భూభాగాన్ని ఆక్రమించడం జాతికి సవాల్ అని, ఇలాంటి సమయంలో అన్ని రాజకీయ పార్టీలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.