Begin typing your search above and press return to search.

విశేషం.. ఆ రాష్ట్రంలో ముస్లిం పార్టీ నుంచి హిందూ అభ్య‌ర్థి విజ‌యం!

By:  Tupaki Desk   |   21 July 2022 9:36 AM GMT
విశేషం.. ఆ రాష్ట్రంలో ముస్లిం పార్టీ నుంచి హిందూ అభ్య‌ర్థి విజ‌యం!
X
హైద‌రాబాద్ లోక్ స‌భ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మ‌జ్లిస్ ఇత్తెహ‌దుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో సంచ‌ల‌న ఫ‌లితం న‌మోదు చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఎంఐఎం పోటీ చేసింది. పూర్తిగా ముస్లింల పార్టీ అయిన ఎంఐఎం ఒక హిందూ మ‌హిళ‌కు సీటు ఇచ్చింది. ఆమె గెలుపొంద‌డంతో ముస్లిం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి నెగ్గిన హిందూ మ‌హిళ‌గా రికార్డు సృష్టించారు.

ఖార్‌గావ్‌ మున్సిపాలిటీలో వార్డు నెంబర్‌ 2లో హిందూ మ‌హిళ అయిన‌ అరుణ శ్యామ్‌ ఉపాధ్యాయకు ఎంఐఎం టికెట్ ఇచ్చింది. అరుణ‌ భర్త శ్యామ్‌ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమ నాయ‌కుడు. రాజ్యాంగం, దళితులు, వెనుకబడిన వర్గాల హ‌క్కుల కోసం కృషి చేస్తుంటారు.

ఆయ‌న ఎంఐఎం సిద్ధాంతాలు న‌చ్చి అందులో చేరారు. ఈ నేప‌థ్యంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సీటును శ్యామ్‌కే ఎంఐఎం కేటాయించాలనుకుంది. అయితే స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే శ్యామ్ భార్య అరుణ‌ను బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విశ్వాస్‌ సారంగ్ ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను చూసుకున్నా ఆమె గెలుపును ఆప‌లేక‌పోయారు.

ఈ నేప‌థ్యంలో ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ మ‌హిళ‌ మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో హిందువుల నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి ఎంఐఎం గెలుపు రుచిచూసింది.

స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ అరుణ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ద‌శ‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎంఐఎం అభ్య‌ర్థులు ఓడించ‌డం విశేషం. ఇప్పుడు రెండో ద‌శ‌లో ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. ఆ పార్టీ మూడు స్థానాలు కైవసం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.