Begin typing your search above and press return to search.

ఆఖ‌రి ఆశ‌ను కూడా జైట్లీ చంపేశాడు

By:  Tupaki Desk   |   11 Aug 2016 11:19 AM GMT
ఆఖ‌రి ఆశ‌ను కూడా జైట్లీ చంపేశాడు
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా క‌ల్లేనా? ఇప్ప‌టికే ఆ మేర‌కు సూచ‌న‌లు ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం ఇపుడు ప్యాకేజీ ఇవ్వాలనుకోవ‌డంపై సీరియ‌స్‌గా దృష్టి సారిస్తోందా? త‌్వ‌ర‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న రానుందా? అంటే ఢిల్లీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్య‌లు ఇదే అర్థానిస్తున్నాయని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏపీ ప్రత్యేక ఆర్థిక సాయం చేయడం ఎలా అన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోందని ఆయ‌న చెప్పిన తీరే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

పార్లమెంట్ ఆవరణలో తాజాగా అరుణ్‌జైట్లీ విలేఖరులతో మాట్లాడుతూ ప్ర‌త్యేక ప్యాకేజీ మాత్ర‌మే ఇవ్వ‌నున్నామ‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీలో ఆర్థిక సహాయంతోపాటు ఒకటి, రెండు రాయితీలు కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలకు సంబంధించిన తొంభై శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోంది. మరికొన్ని పథకాలకు సంబంధించిన ఖర్చులో కేంద్రం డెబ్భై శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగతా ముప్ఫై శాతం ఖర్చును భరిస్తోంది. ఏపీకి ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇప్పుడు 70శాతం ఖర్చును భరిస్తున్న కోర్ పథకాలకు కూడా తొంభై శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది’ అని అరుణ్‌జైట్లీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే రెండు పన్ను రాయితీలు కల్పించామని, ఇప్పుడు మరో పన్ను రాయితీ కల్పించే విషయం పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏదోఒకటి చేయవలసి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. త‌ద్వారా ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ సిద్ధమవుతోందంటూ జైట్లీ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది.

ఏపీకి ప్రకటించవలసిన ప్యాకేజీపై అరుణ్‌జైట్లీతో సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చర్చలు జరుపుతున్నారని స‌మాచారం. ఒకట్రెండు రోజుల్లో ఏపీ ప్యాకేజీకి తుది రూపం ఇవ్వాలనుకునే దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అయితే వెంకయ్యనాయుడుకు స్వల్ప అస్వస్థత చేయటంతో చర్చల ప్రక్రియ ఆగింది. ఆయన కోలుకోగానే ముగ్గురు నేతలు సమావేశమై ప్యాకేజీకి తుదిరూపం ఇస్తారని అంటున్నారు.అయితే, ప్యాకేజీ ఇవ్వటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే చిక్కులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రమే ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.