Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లోని తాగునీటిలో ఆర్సెనిక్..నీటిని తాగితే ఆ తర్వాత...!

By:  Tupaki Desk   |   6 April 2021 8:04 AM GMT
తెలుగు రాష్ట్రాల్లోని తాగునీటిలో ఆర్సెనిక్..నీటిని తాగితే ఆ తర్వాత...!
X
ఆర్సెనిక్ .. అత్యంత విష పదార్థం. ఇట్టే ప్రాణాలు తియ్యగలదు. చూడ్డానికి అందంగా మెరుస్తూ బూడిద రంగులో ఉంటుంది. ఇది చాలా చోట్ల కొద్ది మొత్తంలో ఉండటం సహజం. దురదృష్టం కొద్దీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తాగే నీటిలో ఆర్సెనిక్ సహజంగా ఉండేదాని కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సడెన్‌గా ఇది ఎందుకు ఎక్కువ అవుతోందంటే, భూగర్భ జలాలు పడిపోవడమేనని తేలింది. తాగు నీటి కోసం ప్రజలు భూమిని ఇంకా ఇంకా లోతుగా తవ్వేస్తున్నారు. అలా లోతు ఎక్కువయ్యే కొద్దీ, తాగు నీటిలో రసాయనాలు, ప్రమాదకర ఖనిజ మూలకాలు ఎక్కువవుతాయి. ఎక్కడైతే భూగర్భ జలాల కోసం బాగా తవ్వేస్తున్నారో అక్కడి నీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటోందని తేలింది.

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం.. లీటర్‌ నీటిలో 0.01 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఆర్సెనిక్‌ ఉండొచ్చు. అప్పుడు మనకు ఏమీ కాదు. అది కాస్త ఎక్కువైనా చాలు ప్రాణాలకే ప్రమాదం. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల, గుంటూరు జిల్లాలోని రెండుచోట్ల, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోచోట, భూగర్భ నీటిలో BIS చెప్పిన దాని కంటే ఎక్కువగా ఆర్సెనిక్‌ ఉదని కేంద్ర జలసంఘం తేల్చింది. ఇప్పుడు ఎవరైనా ఆ నీటిని తాగినా, లేదంటే ఆ నీటితో పండించిన పంటల దిగుబడిని తిన్నా ప్రమాదమే. మనుషుల, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ పాడైపోతుంది. అలాగే బోన్‌మ్యారో (ఎముక మజ్జ), చర్మ క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా CWC... తాగునీటిపై పరిశోధనలు చేస్తోంది. కొత్తగా 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్‌ ప్రభావం ఉంది. లీటర్‌ నీటిలో 0.01 నుంచి 0.05 మిల్లీగ్రాముల ఆర్సెనిక్‌ ఉందని CWC తెలిపింది. బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్‌‌లో ఇది ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీటిని తీసుకున్న CWC.. వాటిలో ఆర్సెనిక్‌ ఎంత ఉందో చూసింది. గుంటూరు రూరల్‌ మండలం ఎటుకూరులో బోరు బావుల నుంచి తీసిన నీటిలో ఒక లీటర్‌ నీటిలో 0.01 మిల్లీ గ్రాములు ఉందని తేలింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరాటంపాడులో 0.03 ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రత్న గ్రామంలో 0.02 మీల్లీ గ్రాములు ఉంది. చేబ్రోలు మండలం వడ్డమూడిలో 0.02 మిల్లీ గ్రాములున్నట్లు తేలింది. తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లో CWC చెక్ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివ్వేముల మండలం కుడాకుడా, సూర్యాపేటలలో సేకరించిన బోరు బావుల నీటిలో లీటర్‌లో 0.01, 0.02 మిల్లీగ్రాముల ఆర్సెనిక్‌ ఉన్నట్లు గుర్తించింది. ఆర్సెనిక్‌ ఉన్న నీటిని తాగొద్దనీ, పంటల కోసం వాడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు CWC చెప్పింది. ఆ ప్రాంతాల్లో పంటల సాగు కోసం నదీ జలాల్ని ఇవ్వాలని చెప్పింది.